మరో రెండు నెలల్లో ఆటోనగర్ దాహార్తిని తీరుస్తాం
ABN , First Publish Date - 2023-09-26T01:18:23+05:30 IST
56 ఏళ్ల ఆటోనగర్ వాసుల దాహార్తిని రెండు నెలల్లో తీరుస్తామని కానూరు ఆటోనగర్ క్లస్టరు ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ వెల్లడించారు.

ఆటోనగర్ (పెనమలూరు), సెప్టెంబరు 25: 56 ఏళ్ల ఆటోనగర్ వాసుల దాహార్తిని రెండు నెలల్లో తీరుస్తామని కానూరు ఆటోనగర్ క్లస్టరు ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ వెల్లడించారు. సోమవారం కానూరు కొత్త ఆటోనగర్ క్లస్టరు భవనంలో జరిగిన క్లస్టరు 20వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎంపీ కేశినేని నాని ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.2కోట్లతో మంచినీటి వసతికి ట్యాంకును నిర్మించడంలో తన వంతు కృషి చేసి మరలా ఆర్వో ప్లాంటు నిర్మాణానికి మరో రూ.50లక్షలను మంజూరు చేశారని కొనియాడారు. దీంతో కొన్నేళ్లుగా ఆటోనగర్ వాసులు ఎదురు చూస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారం లభించినట్లయిందని, వచ్చే రెండు నెలల్లో తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. క్లస్టరు నిధులు, ఆటోనగర్లోని అన్ని రకాల సంఘాల సహాయ సహకారాలతో నిర్మించిన ట్రేడ్ సెంటర్ భవనాన్ని వచ్చే దసరాకు సిద్ధం చేసి ప్రారంభిస్తామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ఎంపీ కేశినేని నానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత ఇటీవల మృతి చెందిన సన్లైటు రామారావుకు నివాళులర్పించారు. ఫైనాన్సియల్ డైరెక్టర్ బాయిని బాబ్జీ, సీఈవో ప్రవీణ్, డైరెక్టర్లు పంచుమర్తి ప్రసాద్, జమ్ము ప్రసాద్, త్రినాథ్, మెకానికల్ అసోసియేషన్ కొండ, ఎంఎ్సఎంఈ దుర్గాప్రసాద్, వేమూరి సామ్రాట్, సభ్యులు అబ్దుల్ కలాం పాల్గొన్నారు.