వర్షం వస్తే మునక.. లేకుంటే మెట్ట!
ABN , First Publish Date - 2023-07-15T01:03:24+05:30 IST
మండలంలోని పలు గ్రామాల్లో పంట కాల్వలు అధ్వానంగా మారాయి. కాల్వల్లో పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో వరిసాగు రైతుకు భారంగా మారింది. వర్షం వస్తే మునక.. లేకుంటే మెట్టగా మాగాణి పరిస్థితి.
ఫ అఽధ్వానంగా పంట కాల్వలు
ఫ పచ్చగడ్డి, పిచ్చి మొక్కలతో పూడిక
ఫ లో వోల్టేజీతో ఎండిపోతున్న బోర్ల కింద నారుమళ్లు
ఫ రైతుకు భారంగా వరిసాగు
ఫ పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
కంకిపాడు, జూలై 14 : మండలంలోని పలు గ్రామాల్లో పంట కాల్వలు అధ్వానంగా మారాయి. కాల్వల్లో పచ్చగడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో వరిసాగు రైతుకు భారంగా మారింది. వర్షం వస్తే మునక.. లేకుంటే మెట్టగా మాగాణి పరిస్థితి. కాల్వలు, పెద్ద బోదెలు తవ్వించాల్సిన ప్రభుత్వ అధికా రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరో వైపు లో వోల్టేజీ సమస్యతో బోర్ల కింద నారుమళ్లు ఎండిపోయాయి. కొన్ని చోట్ల రైతులు సొంతంగా కాల్వలు బాగు చేయించుకో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్ల కింద నారుమళ్లు వేసిన రైతులు కొన్ని చోట్ల వరినాట్లు మొదలు పెట్టారు. కాల్వ కింద పోయాల్సిన నారుమళ్లకు నీరు అందని పరిస్థితి నెలకొంది.
మండలంలోని సుమారు 20 గ్రామాల్లోని సుమారు 17 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. జూన్లో వర్షాలు పడాల్సి ఉన్నా వర్షాభావం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోర్లు కింద సాగు చేస్తున్న రైతులు నారుమళ్లు వేసుకున్నప్పటికీ కాల్వల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు మాత్రం వర్షాల కోసం, కాల్వల నీరుకోసం ఎదురు చూ స్తున్నారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాల కార ణంగా నారుమళ్లు, వరినాట్ల హడావుడి ప్రారం భమైంది. తీరా నాట్లు వేసిన తర్వాత భారీ వర్షాలు పడితే నీటి ప్రవాహం లేక వరి నాట్లు మునిగిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏ ఒక్క పంట కాల్వను బాగు చేయించిన దాఖలాలు లేవు. దీంతో పంట కాల్వల పరిస్థితి అధ్వానంగా మారాయి. దీంతో సాగు నీరందించేందుకు అవసరమైన కాల్వలను రైతులు వేల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన కాల్వలు తవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.