పాల వ్యాన్ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
ABN , First Publish Date - 2023-06-26T02:10:50+05:30 IST
విజయ పాలవ్యాన్ను అతివేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టడంతో క్యాషియర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ప్రసాదంపాడులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
గుణదల, జూన్ 25 : విజయ పాలవ్యాన్ను అతివేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టడంతో క్యాషియర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ప్రసాదంపాడులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. తోట్లవల్లూరు మండలం గరికపాడు గ్రామానికి చెందిన చండూరు వెంకటేశ్వరరావు(44) 15 సంవత్సరాలుగా విజయ డెయిరీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ప్రసాదంపాడు గ్రామ శివారులో శక్తికళ్యాణమండపం వద్ద ఆదివారం తెల్లవారుజామున విజయ పాలవ్యాన్ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో అదే మార్గంలో విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ వెనుకభాగంలో ఉన్న వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. వ్యాన్లోని పాల ట్రేలు, పెరుగు బక్కెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పటమట సెక్టార్ ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వ్యాన్ డ్రైవర్ చెత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.