రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ABN , First Publish Date - 2023-12-11T00:33:26+05:30 IST
ప్రకృతి కన్నెరతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి అన్నారు.
నందిగామ రూరల్, డిసెంబరు 10: ప్రకృతి కన్నెరతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి అన్నారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను మునగచర్లలో నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో తుఫాన్ దాటికి పంట నష్టపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తోట నాగమల్లేశ్వరరావు, విక్రమ్, వేల్పుల బిక్షాలు, పంగలూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పొగాకు రైతుల్ని ఆదుకోవాలి
రెడ్డిగూడెం: తుఫాన్ కారణంగా పొగాకు పంటను కొల్పోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.విజయబాబు, మండల పార్టీ అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలో దెబ్బతిన్న పొగాకు పంటను ఆదివారం పరిశీలించారు. మండలంలో సుమారు 200 ఎకరాల్లో పొగాకు పంట దెబ్బతిందన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు కాంతారెడ్డి, చాట్ల చందా, మాతంగి రామారావు, రైతులు పాల్గొన్నారు.