అంగరంగ వైభవంగా సుబ్బారాయుడి రథోత్సవం

ABN , First Publish Date - 2023-01-29T01:34:58+05:30 IST

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

అంగరంగ వైభవంగా సుబ్బారాయుడి రథోత్సవం
రథోత్సవాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు

మోపిదేవి, జనవరి 28: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. విద్యుత్‌ దీపాలు, పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించిన ఐదంతస్థుల రథంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను గావించగా, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ఎన్‌.ఎస్‌.చక్రధరరావు ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి తాడులాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన అశేష జనవాహిని జయజయ ధ్వానాల నడుమ రథోత్సవం పురవీధుల్లో కొనసాగింది. చల్లపల్లి సీఐ బి.బి.రవి కుమార్‌, మోపిదేవి ఎస్‌ఐ సీహెచ్‌ పద్మ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్టేట్‌ ఉద్యోగులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

శాస్త్రోక్తంగా వసంతోత్సవం

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వసంతోత్సవం, అవభృద స్నానోత్సవాన్ని అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామికి సుప్రభాత సేవ, ప్రాతఃకాల్చారన, పంచామృత స్నపన, నిత్యహోమం జరి పారు. పలు రకాల పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకాలను ఆలయ ఈవో ఎన్‌.ఎస్‌.చక్రధరరావు ప్రారంభించారు. మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో వేద విద్వత్‌సభ, పండిత సత్కారం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చెందిన 45 మంది చతుర్వేద పండితులతో చతుర్వేద పారాయణం, వేద ఘోష జరిపారు. ఆలయ ఈవో ఎన్‌.ఎస్‌.చక్ర ధర రావు, వేదపండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మ, ప్రధాన అర్చకుడు బుద్ధు పవన్‌కుమారశర్మ ఆధ్వర్యంలో వేదపండితులను నూతనవస్త్రాలతో సత్కరించారు.

Updated Date - 2023-01-29T01:34:59+05:30 IST