Share News

పారిశుధ్య కార్మికుల సమ్మె సైరన్‌

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:09 AM

జయవాడ నగరపాలక సంస్థ ఆప్కాస్‌ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజుల క్రితం కార్మికులు, కార్మిక సంఘాలు సమ్మె నోటీసులిచ్చాయి.

పారిశుధ్య కార్మికుల సమ్మె సైరన్‌

సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌

సమ్మెలోకి 3,500 మంది కార్మికులు

నగరంలో నిలిచిపోనున్న చెత్త సేకరణ, నీటి సరఫరా

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

చిట్టినగర్‌, డిసెంబరు 25 : విజయవాడ నగరపాలక సంస్థ ఆప్కాస్‌ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజుల క్రితం కార్మికులు, కార్మిక సంఘాలు సమ్మె నోటీసులిచ్చాయి. అయితే, ప్రభుత్వం, అధికారులు సమస్యలను పరిష్కరించకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. సీఎం జగన్‌ తన పాదయాత్ర సమయంలో పారిశుధ్య కార్మికులకు పలు హామీలు గుప్పించారని, కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్‌ సిబ్బందికి సీపీఎస్‌ వారంలోనే రద్దు చేస్తా నని, ఇతర అలవెన్స్‌లు, తదితర హామీలు ఇచ్చారని, నాలుగున్నరేళ్లుగా ఇదిగో అదిగో.. అంటూ కాలయాపన చేస్తూ కార్మికులను మభ్యపెడుతున్నారని కార్మికులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కార్మికుల డిమాండ్లు ఇవీ..

సీఎం జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మినెంట్‌ ఉద్యోగుల ఎరియర్స్‌ బకాయిలు చెల్లించాలని, పని భద్రత కల్పించాలని, పారిశుధ్య విభాగంలో పని చేసే కార్మికులందరికీ హెల్త్‌ అలవెన్సులు ఇవ్వాలని, పనిభారం తగ్గించి, అధికారుల వేధింపులు ఆపాలని, ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే కార్మికులకు స్కిల్‌, ఆన్‌స్కిల్‌ వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారు.

పారిశుధ్యం, నీటి సరఫరాకు అవాంతరమే..

ఆప్కాస్‌ సిబ్బంది సమ్మెతో నగరపాలక సంస్థలో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, డ్రెయినేజీ, ఉద్యానశాఖ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనులకు బ్రేక్‌ పడనుంది. సుమారు 3,500 మంది కార్మికులు సమ్మెలోకి వెళ్తుండటంతో నగరంలో పారిశుధ్యం క్షీణించడంతోపాటు మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారిస్తున్నా ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు సమ్మెకు దిగడంతో పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం కష్టసాధ్యంగా మారింది. నగరంలో పారిశుధ్య పనులతో పాటు ఇంజనీరింగ్‌, వాటర్‌, డ్రెయినేజీ, పార్కులు తదితర విభాగాల్లో పనులకు అవాంతరం ఏర్పడనుంది. నగరంలో రోజూ సుమారు 500 టన్నుల చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరించి తరలిస్తారు. ఈ సమ్మెతో డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ నిలిచిపోనుంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..

కార్మికుల సమస్యలకు సంబంధించి ఇప్పటికి పలుమార్లు మాట్లాడటం జరిగింది. కార్మికులు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నగరపాలక సంస్థలో పనిచేసే సుమారు 472 పర్మినెంట్‌ కార్మికులతోపాటు సీఎన్‌జీ ప్రైవేట్‌ ఆటోలు 225, కార్పొరేషన్‌ ఆటోలు 25 ద్వారా డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణకు ఇబ్బంది కలగకుండా చూడటంపై దృష్టి పెట్టాం. ప్రధాన రహదారులతోపాటు పారిశుధ్య, డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లతో పాటు ఏఎంహెచ్‌వోల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెత్త పేరుకు పోకుండా చర్యలు తీసుకుంటాం.

- రత్నావళి, చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (సీఎంహెచ్‌వో), వీఎంసీ

Updated Date - Dec 26 , 2023 | 12:09 AM