అంపాపురంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
ABN , First Publish Date - 2023-01-15T01:00:32+05:30 IST
కేసినో నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చిన అంపాపురం ప్రాంతాన్ని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా శనివారం రాత్రి 11 గంటల సమయంలో తనిఖీ చేశారు.
హనుమాన్ జంక్షన్/హనుమాన్ జంక్షన్ రూరల్, జనవరి 14 : కేసినో నిర్వహిస్తున్నట్టు వార్తలొచ్చిన అంపాపురం ప్రాంతాన్ని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా శనివారం రాత్రి 11 గంటల సమయంలో తనిఖీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని ఓ అజ్ఞాత వ్యక్తి డీజీపీకి ఫిర్యాదు చేసిన వైనం పోలీసు శాఖలో కలకలం రేపింది. దీంతో ఎస్పీ తన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి.. అంపాపురంలో కేసినో ఏర్పాటు చేసినట్టు, చీర్ గర్ల్స్తో పందెపు రాయుళ్లకు సకల సౌకర్యాలు చేస్తున్నట్టు వీడియో సహా ఆధారాలు పంపినట్టు తెలుస్తోంది. శిబిరంలో పూర్తిగా తనిఖీలు చేశామని, అమ్మాయిలను తీసుకొచ్చారనే ఆరోపణలు అవాస్తవమని ఎస్పీ వెల్లడించారు. సమయం దాటాక కొంతమంది భోజనాలు చేస్తున్నారని, అందుకు వీల్లేదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సంఘటనపై విచారణ జరుపుతామని ఎస్పీ తెలిపారు.