సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదు
ABN , First Publish Date - 2023-09-12T00:55:14+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లాంటి వారిపై నేరారోపణలు వచ్చినప్పుడు వారికి రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్సెల్ చైర్మన్, బెజవాడ బార్ మాజీ అధ్యక్షుడు వి.గురునాథం ఉద్ఘాటించారు.
విజయవాడ లీగల్, సెప్టెంబరు 11: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లాంటి వారిపై నేరారోపణలు వచ్చినప్పుడు వారికి రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్సెల్ చైర్మన్, బెజవాడ బార్ మాజీ అధ్యక్షుడు వి.గురునాథం ఉద్ఘాటించారు. సోమవారం సిటీ సివిల్ కోర్టుల ఆవరణలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రబాబు కానీ, రాష్ట్ర, దేశ అగ్రనేతలపై నేరారోపణలు వచ్చినప్పుడు కోర్టు వారికి రిమాండ్ విధించాల్సిన అవసరం లేదన్నారు. బాధ్యతగల వ్యక్తులపై నేరారోపణలు వచ్చినప్పుడు కోర్టు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయని, ఆ వ్యక్తి దేశం విడిచి పారిపోవడం, సాక్షులను భయబ్రాంతులకు గురిచేయడం, కోర్టు, పోలీసులు పిలిచినప్పుడు హాజరయ్యే అవకాశం ఉంటుందా లేదా అని పరిశీలించాలన్నారు. చంద్రబాబు విషయంలో ఆయన దేశం విడిచి పారిపోయే వ్యక్తి కాదని, ఇప్పటికే సీఐడీ పోలీసులు 120 మందికి పైగా సాక్షులను విచారించారని, కాబట్టి సాక్షులను భయబ్రాంతులకు గురిచేసే అంశమే తలెత్తదని గురునాథం తెలిపారు. కోర్టు, పోలీసుఉ ఎప్పుడు పిలిచినా చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని, కాబట్టి రిమాండ్ అవసరం ఉండదన్నారు.
ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదు
ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని గురునాథం స్పష్టం చేశారు. ఈ సెక్షన్ అవినీతికి పాల్పడిన ప్రభుత్వోద్యోగులపై తప్ప, ప్రజాప్రతినిధి చంద్రబాబుకు వర్తించదన్నారు.
సీఐడీ కాదు.. ఏసీబీ పోలీసులే పెట్టాలి
చంద్రబాబును ఏసీబీ కోర్టులో రిమాండ్ పెట్టాలనుకొంటే సీఐడీ పోలీసులు పెట్టరాదని, ఏసీబీ పోలీసులే పెట్టాలని గురునాథం తెలిపారు. చంద్రబాబుపై అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ సెక్షన్లను ఉదహరించిన సీఐడీ పోలీసులు తమంత తాముగా ఏసీబీ కోర్టులో రిమాండ్ పెట్టేందుకు వీలులేదని, ఏసీబీ పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. స్కిల్ డెవల్పమెంట్ కేసుపై సీఐడీ పోలీసులు మూడేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాలుగైదు రోజుల క్రితమే చంద్రబాబు పేరును చేర్చడంపై అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని, ఇది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు కాదని గురునాథం తెలిపారు.