గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:19 AM
చల్లపల్లి మార్గంలో 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఘంటసాల, డిసెంబరు 16 : చల్లపల్లి మార్గంలో 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చల్లపల్లి మండలం కొత్తమాజేరు, ఘంటసాల మండలం జీలగలగండి మధ్యలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి ప్రమా దం జరిగింది. కొత్తమాజేరు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకట నాగేశ్వరరావు అలియాస్ నాగయ్య ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తిని ఎక్కించుకుని మచిలీపట్నం వైపు నుంచి కొత్తమాజేరు వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నాగయ్యకు తీవ్రగాయాలు కాగా, వెనుక కూర్చున్న వ్యక్తి నేలపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఘంటసాల 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా, నాగయ్యను మెరుగైన చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు. ద్విచక్ర వాహనంపై కూర్చున్న వ్యక్తి మంగళాపురం గ్రామానికి చెందిన నాంచారయ్యగా తెలియవచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.