నేడు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-06-03T01:23:02+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

నేడు ఆర్జీయూకేటీ నోటిఫికేషన్‌

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..జూలై 13న సెలక్షన్‌ లిస్ట్‌.. 21 నుంచి 25 వరకు కౌన్సెలింగ్‌..ఆగస్టు పదో తేదీలోపు తరగతులు ప్రారంభం

నూజివీడు టౌన్‌, జూన్‌ 2: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి నూజివీడు ట్రిఫుల్‌ ఐటీ క్యాంప్‌సలో ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ కేసీ రెడ్డి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘నూజివీడు, ఆర్కేవ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలలో 4,400 సీట్లకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ 4వ తేదీ నుంచి ప్రారంభమై 26వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తులను ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరి వారికి జూలై 5 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారి రిజర్వేషన్‌ను మూడు నుంచి ఐదు శాతానికి పెంచాం. 40 శాతం అంగ వైకల్యం ఉన్నవారు మాత్రమే ఈ కేటగిరిలో అర్హులు. జనరల్‌ కేటగిరి ఎంపిక జాబితాను జూలై 13న ఆన్‌లైన్‌లో ఉంచుతాం. జూలై 21, 22 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25 తేదీల్లో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఒంగోలు క్యాంపస్‌ విద్యార్థులు ఇడుపులపాయ క్యాంప్‌సకు, శ్రీకాకుళం విద్యార్థులు ఎచ్చెర్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్టు పదో తేదీలోపు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. రెగ్యులర్‌ అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలి’ అని కేసీ రెడ్డి వివరించారు.

Updated Date - 2023-06-03T01:23:02+05:30 IST