విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రిపోర్టులందక రోగుల పాట్లు
ABN , First Publish Date - 2023-11-20T01:06:10+05:30 IST
ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలో రోగులను సవాలక్ష సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్యపరీక్షల రిపోర్టులు పొందాలంటే రోగుల బంధువులు పోరాటమే చేయాల్సి వస్తోంది.

ఉన్నది ఒకే కంప్యూటర్.. వందల సంఖ్యలో రోగులు
విజయవాడ ప్రభుత్వాసుపత్రి, నవంబరు 19: ప్రభుత్వ సర్వజన ఆసు పత్రిలో రోగులను సవాలక్ష సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్యపరీక్షల రిపోర్టులు పొందాలంటే రోగుల బంధువులు పోరాటమే చేయాల్సి వస్తోంది. వందల సంఖ్యలో రిపోర్టుల కోసం బారులు తీరాల్సివస్తోంది. ఒక రిపోర్టు తీసుకోవడానికి గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడాల్సి వస్తోందని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇంత జరు గుతున్నా సమస్యను పరిష్కరించేందుకు ఎవరూ చొరవ చూపకపోవడంతో రోగులు, వారి వెంట వచ్చే వారికీ నరకం కనిపిస్తోంది. ఉచిత వైద్యం ఏమో గాని ప్రయాణ, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయని పలువురు వాపోతున్నారు. విజయవాడ కొత్తాసుపత్రికి రోజుకు సుమారు 400 మంది పలు పరీక్షల నిమిత్తం వస్తూ ఉం టారు. వాటిలో రక్త నమూనాలకు, ఎక్స్రేలకు పేర్లు నమోదు చేస్తారు. ఒకే ఒక్క కంప్యూటర్ ఉండటంతో మాన్యువల్గా రిపోర్టులు ఇవ్వడంతో విపరీతమైన రద్దీ ఉం టోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచే కాక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆసుపత్రికి పలు వైద్య సేవల కోసం వస్తుంటారు. రోగికి రక్త, వైద్య పరీక్షలను బట్టే వైద్యం అం దించాల్సి ఉంటుంది. ఓపీ కేవలం 12 గంటల వరకే ఉండటంతో రోగులకు ఆ సమ యానికి రిపోర్టులు అందడం లేదు. దీంతో ఒక్క రోజులో పరీక్షలు చేయించుకొని వెళ్లాల్సిన రోగులు మరో రోజు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. అదే రిపోర్టులు సకా లంలో వస్తే రోగులకు ప్రయాణ ఖర్చులు, దూరాభారం తగ్గుతుంది. వైద్యాధికారులు స్పందించి రిసిప్టులు ఇచ్చే బ్లాక్లో కంప్యూటర్ల సంఖ్య పెంచి రక్త నమూనా , ఎక్స్రే రిపోర్టులు సకాలంలో అందేలా చూడాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.