ప్రజల హక్కులు, స్వేచ్ఛ హరిస్తున్న పాలకులు
ABN , First Publish Date - 2023-10-02T01:32:08+05:30 IST
ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్ఛపైనా నేడు పాలకులు దాడులకు తెగబడుతున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్ అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్వర్ణోత్సవాలను కృష్ణాజిల్లా కంకిపాడులోని ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది.
కంకిపాడు, అక్టోబరు 1 : ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్ఛపైనా నేడు పాలకులు దాడులకు తెగబడుతున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్ అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్వర్ణోత్సవాలను కృష్ణాజిల్లా కంకిపాడులోని ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాగేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్రాలపైనా పాలకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇంట్లో భార్యాభర్తలు దాంపత్య జీవితం గడపాలన్నా, ఇంట్లో నలుగురు కుర్చొని మాట్లాడుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పని సరి చేసే విధంగా ప్రస్తుత పాలకుల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో గుజరాత్లో ఓ వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ పెడితే అసోం పోలీసులు వచ్చి అరెస్టు చేశారన్నారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం కొరవడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య వాదం వంటి ఉద్యమాల సమయంలో అనేక సంఘాలు నిట్టనిలువునా చీలిపోయినా.. సూత్ర బద్దమైన వైఐఖరికి కట్టుబడి ఉన్నది ఒక్క యూటీఎఫ్ మాత్రమే అన్నారు. ఉపాధ్యాయులను ఐక్యంగా ఉండనీయకుండా కులం, మతం, ప్రాంతాలు, భావాల చిచ్చుతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలానికి యూటీఎఫ్ వేగుచుక్క కావాలని ఆకాంక్షించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, అందరూ చదువుకోవాలన్నదే యూటీఎఫ్ లక్ష్యమన్నారు. అయినా నేటికి బడి బయయట సుమారు 2 కోట్ల మంది ఉన్నారన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడం యూటీఎఫ్ ప్రధాన కర్తవ్యమన్నారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు ద్వారా సాధించుకున్నఓల్డ్ పెన్షన్ స్కీం ఉద్యోగుల హక్కు అని.. ప్రభుత్వాలు వేసిన భిక్ష కాదని తెలియజేశారు. వైస్ జగన్ ఓపీఎ్సను రద్దు చేసి జీపీఎస్ అంటూ మాట్లాడం సిగ్గు చేటన్నారు. ఓపీఎస్ పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పీడీఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ వి. బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు బి. వెంకటేశ్వరరావు, టీఎ్సయూటీఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో ఫంక్షన్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పాటలతో జానపద కళాకారులు ఉర్రూతలూగించాయి.