ఇదేం పంచాయితీ..!
ABN , First Publish Date - 2023-02-24T00:35:18+05:30 IST
బిల్లు పేమెంట్లు ఇస్తామన్న పేరుతో పంచాయతీరాజ్ ఇంజనీర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఈఎస్) కింద చేపట్టిన పలు పనులకు సంబంధించి వెరిఫికేషన్ పేరుతో రికార్డులు తీసుకురావాలంటూ మళ్లీ పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం వేధింపులకు పాల్పడుతోంది.
పంచాయతీరాజ్ ఈఈల మెడపై కత్తి
ఇప్పటికే రికార్డులు సమర్పించినా మళ్లీ తేవాలంటూ ఒత్తిడి
రెండు జిల్లాల నుంచి ఇంజనీర్ల ఉరుకులు, పరుగులు
అన్నీ తీసుకొచ్చినా రాత్రింబవళ్లు పడిగాపులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బిల్లు పేమెంట్లు ఇస్తామన్న పేరుతో పంచాయతీరాజ్ ఇంజనీర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఈఎస్) కింద చేపట్టిన పలు పనులకు సంబంధించి వెరిఫికేషన్ పేరుతో రికార్డులు తీసుకురావాలంటూ మళ్లీ పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం వేధింపులకు పాల్పడుతోంది. గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లు చెల్లింపులకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసుల పరిష్కారం నిమిత్తం బిల్లులు ఇస్తామని, ఈఈలు రికార్డులతో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఈఎన్సీ కార్యాలయ అధికారులు మూడు రోజులుగా పాట పాడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఈఎన్సీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పీఆర్ ఇంజనీర్లు మూడు రోజులుగా రికార్డులతో వెళ్లి రాత్రింబవళ్లు పడిగాపులు పడుతున్నారు. ఇప్పటి వరకు పైసా అయితే ఇవ్వలేదు కానీ, ఇస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే రికార్డులు అందజేసినా..
కోర్టు ధిక్కరణకు చెందిన పనుల బిల్లు చెల్లింపులకు ఇప్పటికే ఇంజనీర్లు సమగ్ర రికార్డులను అందించారు. అంతకుముందు వెరిఫికేషన్ పేరుతో అనేక మార్లు రికార్డులు కోరితే ఇచ్చారు. రికార్డులు తమ దగ్గర ఉన్నా తప్పులేవో జరిగిపోయాయన్న రీతిలో ఈఎన్సీ కార్యాలయ ఉన్నతాధికారులు వ్యవహరించటం పీఆర్ ఇంజనీర్లను మానసికంగా కుంగదీస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు సంబంధించి ఎంబుక్స్, మెజర్మెంట్ బుక్స్, ఒరిజినల్ శాంక్షన్ కాపీ, ఈఈ టెక్నికల్ శాంక్షన్ కాపీలతో పాటు పిటిషనర్ కాపీ, కోర్టులో వేసిన రిట్ పిటిషన్, జడ్జిమెంట్ కాపీలను వెంట తీసుకురావాలని చెబుతున్నారు. తొలిరోజు వీటిలో కొన్నింటి గురించి చెప్పారు. ఆ తర్వాత మరికొన్ని తీసుకురావాలన్నారు. రికార్డులపరంగా ఎంబుక్లు, మెజర్మెంట్ బుక్స్, కోర్టు కేసులకు సంబంధించి రిట్ పిటిషన్, జడ్జిమెంట్ కాపీలను తీసుకెళ్లొచ్చు కానీ, పిటిషనర్ కాపీలను సమర్పించలేరు. పిటిషనర్ కాపీలను అప్పటికప్పుడు తీసుకురావాల్సిందిగా కోరటంతో ఈఈలకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి 9 గంటల తర్వాత కార్యాలయానికి రావాలని, బిల్లు చెల్లింపులకు సంబంధించి అనుమతులు పొందిన తర్వాతే వెళ్లాలని నిర్దేశించటంతో పీఆర్ ఇంజనీర్లు ఈఎన్సీ కార్యాలయంలోనే గడుపుతున్నారు.
బిల్లు చెల్లింపులకు ఈఈలు రావాలా?
పూర్తయిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు. రెండు జిల్లాల నుంచి దాదాపు వందకు పైగా కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయి. హైకోర్టు సీరియస్ కావడంతో పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయ అధికారులు ఇప్పుడు స్పందించి ఈఈలను ఇబ్బందులు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎన్ఆర్ ఈజీఎస్ పనులకు సంబంధించి ఇప్పటికి పలుమార్లు పీఆర్ ఉన్నతాధికారులు విచారణలు జరిపారు. ఎలాంటి లోపాలను గుర్తించలేదు. మళ్లీమళ్లీ రికార్డుల వెరిఫికేషన్ అంటున్నారు. కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా అదే పాట పాడుతున్నారు. ఒకవేళ తప్పులు జరిగినా రికార్డులను పరిశీలిస్తే ఏం తెలుస్తుంది. పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరగాలి. తప్పులకు సంబంధించి పరిశీలన జరిపి, వివరణ కోరితే అర్థముంటుంది కానీ, ఇంజనీర్లను ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్న వాదన వినిపిస్తోంది.