కక్ష్యసాధింపు చర్యలు సరికాదు!
ABN , First Publish Date - 2023-06-07T00:47:35+05:30 IST
ముక్కలుగా నరికినా పార్టీకి విధేయుడినే.. దౌర్జన్యాలకు భయపడి పార్టీ మారడం, వత్తాసు పలకటం ఉండబోదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం హింసాత్మక ధోరణి మానుకోవాలి.. కక్ష్యసాధింపు చర్యలు సరికాదని హితవు పలికారు.
గన్నవరం, జూన్ 6 : ముక్కలుగా నరికినా పార్టీకి విధేయుడినే.. దౌర్జన్యాలకు భయపడి పార్టీ మారడం, వత్తాసు పలకటం ఉండబోదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం హింసాత్మక ధోరణి మానుకోవాలి.. కక్ష్యసాధింపు చర్యలు సరికాదని హితవు పలికారు. మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు చెందిన షెడ్డును కూల్చివేయటంపై మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కొనకళ్ల అన్నారు. చట్ట ప్రకారం జాస్తి వెంకటేశ్వరరావు ఆధీనంలోనే భూమి ఉన్నా.. రెవెన్యూ అధికారులకు తెలిసి కూడా ఏకపక్షంగా వ్యవహరించటం దుర్మార్గమన్నారు. పార్టీలకు అధికారం శాశ్వతం కాదన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జాస్తి వెంకటేశ్వరరావును వైసీపీ ఎమ్మెల్యే వంశీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, టీడీపీ జెండాతో గెలిచి వైసీపీలో చేరిన వంశీ ఓటమి భయంతో టీడీపీ నేతల అణిచివేతకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీకి గన్నవరం కంచుకోట అని ఎవరూ దానిని బద్దలు కొట్టలేరన్నారు. రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న మాట్లాడుతూ, ఇంకా పది నెలలు మాత్రమే సమయం ఉందని ఆ తరువాత టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అనంతరం వెదురుపావులూరులో కూల్చివేసిన షెడ్డును పరిశీలించారు. నేతలు చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్, దయాల రాజేశ్వరరావు, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, బోడపాటి రవికుమార్, జూపల్లి సురేశ్, జాస్తి శ్రీధర్, కోనేరు నాని, గూడవల్లి నర్సయ్య, గుజ్జర్లపూడి బాబూరావు, మండవ అన్వేష్, మేడేపల్లి రమాదేవి, పరుచూరి నరేశ్, చీమలదండు రామకృష్ణ, షేక్ అబుల్యాజ్, కంచర్ల ఈశ్వరరావు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.