రెండో రోజు మోకాళ్లపై నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:00 AM
దీర్ఘ కాలంగా మునిసిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ కార్మికులు మోకాళ్లపై నిలబడి ఆందోళన నిర్వహించారు.
నందిగామ, డిసెంబరు 27: దీర్ఘ కాలంగా మునిసిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ కార్మికులు మోకాళ్లపై నిలబడి ఆందోళన నిర్వహించారు. బుధవారం మునిసిపల్ కార్యాలయం వద్ద విధులు బహిష్కరించి ఆందోళన చేసిన కార్మికులు వైసీపీ ఎన్నికలలో ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్లు పరిష్కరించకపోతే విధులు చేపట్టమని హెచ్చరించారు. కార్యక్రమంలో పిచ్చయ్య, మాణిక్యం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
మోకాళ్ళపై నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన
తిరువూరు: తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేపట్టిన మున్సిపల్ పారిశుధ్యం కార్మికులు రెండో రోజు బుధవారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు గద్దె రమణ సంఘీభావం తెలిపారు.
జగ్గయ్యపేట: మునిసిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె బుధవారం రెండో రోజు కొన సాగింది. మునిసిపల్ పాత కార్యాలయం గేటు ఎదుట నిర్వహించిన నిరసన శిబిరాన్ని నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి కొదమల ప్రభుదాస్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఎ.శివాజీ తదితరులు సంఘీభావం తెలిపారు. పారిశుధ్య కార్మికులను బేషరతుగా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.