ఎన్నారై అరెస్టు; బెయిల్‌పై విడుదల

ABN , First Publish Date - 2023-03-31T00:51:56+05:30 IST

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడని ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

ఎన్నారై అరెస్టు; బెయిల్‌పై విడుదల
అంజన్‌ను పరామర్శిస్తున్న టీడీపీ నాయకులు

గన్నవరం/విజయవాడ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడని ఎన్నారైని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక రాయనగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి పొందూరి సాంబశివరావుకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు అంజన్‌ స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదు వచ్చిందని ఎస్సైలు శ్రీనివాస్‌, రమే్‌షబాబు, సిబ్బందితో బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న అంజన్‌ను బలవంతంగా తీసుకువెళ్లారు. రెండు గంటల్లో పంపిస్తామని చెప్పి ఎంతసేపటికి ఎక్కడ ఉన్నాడో సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు కూడా తీసుకోలేదన్నారు.

రెచ్చగొట్టేలా పోస్టులు : డీఎస్పీ

సోషల్‌ మీడియాలో ప్రముఖ వ్యక్తులపై పోస్టులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న సైబర్‌ నేరగాడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్టు డీఎస్పీ కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వచ్చింది. అంజన్‌ చౌదరి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అంజన్‌ యువగళం అక్కౌంట్‌ ద్వారా విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నాడని పేర్కొన్నారు. అతడి మొబైల్‌, ట్యాబ్‌, తదితర ఎలక్టానిక్‌ గాడ్జెట్‌ పరికరాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబెరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు.

రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయస్థానం..

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిన ఎన్‌ఆర్‌ఐ అంజన్‌కు న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరించింది. గన్నవరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత విజయవాడలోని 12వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్‌ విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించగా.. గన్నవరం పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవే నిందితుడి తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ నిందితుడికి బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఈ వాదనకు న్యాయమూర్తి అంగీకరించారు. అంజన్‌కు రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

అంజన్‌కు టీడీపీ నేతల పరామర్శ

ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపటమే అంజన్‌ చేసిన తప్పా అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు, టీడీపీ నాయకులు బచ్చుల సుబ్రమణ్యం, బుస్సే నాగ ప్రసాద్‌లు ప్రశ్నించారు. గన్నవరంలో అంజన్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

Updated Date - 2023-03-31T00:51:56+05:30 IST