సమస్యలపై గొంతెత్తి పలికేలా యువగళం
ABN , First Publish Date - 2023-01-29T00:57:18+05:30 IST
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గొంతెత్తి పలికేలా నారా లోకేష్ చేస్తున్న యువగళం ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
గుణదల, జనవరి 28 : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గొంతెత్తి పలికేలా నారా లోకేష్ చేస్తున్న యువగళం ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్థానిక 5వ డివిజన్లో సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అమ్మ కల్యాణమండపం ఎదురుగాగల మసీదు రోడ్డులో శనివారం పర్యటించి సమస్యలు అడిగితెలుసుకున్నారు. అదే సమయంలో నూకల జాన్, మామిడి మేరీకి స్వయం ఉపాధి కింద కర్రీపాయింట్, కూరగాయల బండిని అందజేశారు. అనంతరం కేశినేని శివనాథ్ ఏర్పాటు చేసిన మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా స్థానికులకు అన్నదానం చేశారు. జగన్మోహనరెడ్డి తన సొంత సొమ్ముతో ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టుగా పత్రాలపై ఫొటోలు వేసుకోవడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రజలే శాశ్వతమన్నది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురైతే దాన్ని లోకేష్ ఐరన్ లెగ్ అంటున్న వైసీపీ నేతలు జగన్ అధికారంలోకి రాగానే కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయారని దానికేం సమాధానం చెరబుతారని ప్రశ్నించారు. సమాజాన్ని ఆర్థికంగా బలపడేలా చేయాలన్నదే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని దాన్ని దృష్టిలో పెట్టుకునే తాను తన సొంత నిధులతో స్వయం ఉపాధి కింద మహిళలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. 5వ డివిజన్ అధ్యక్షుడు నందిపాటి దేవానంద్, కోడూరు సుబ్రహ్మణ్యం, రాచమళ్ల ఆంజనేయులు, కూనిపల్లి కాళీకృష్ణ, ఏసుపోగు మోజెస్, షేక్ షరీఫ్ పాల్గొన్నారు.