భూముల విలువకు రెక్కలు
ABN , First Publish Date - 2023-06-01T00:16:13+05:30 IST
జిల్లాలో 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువను 30 శాతానికి పెంచుతూ రిజిస్ర్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంటుమిల్లిలోని భూముల విలువ 55.5 శాతానికి అధికంగా పెంచగా, ఆ తరువాత ఉయ్యూరు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 42 శాతం అధికంగా పెంచారు.
జిల్లాలో 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో 30 శాతం పెరుగుదల
452 గ్రామాల్లో భూముల విలువ పెరుగుదల
అత్యధికంగా బంటుమిల్లి సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 55.5 శాతం హెచ్చు
మచిలీపట్నం టౌన్, మే 31 : జిల్లాలో 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువను 30 శాతానికి పెంచుతూ రిజిస్ర్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంటుమిల్లిలోని భూముల విలువ 55.5 శాతానికి అధికంగా పెంచగా, ఆ తరువాత ఉయ్యూరు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 42 శాతం అధికంగా పెంచారు. మిగిలిన సబ్ రిజిస్ర్టార్ పరిధిలోని భూముల విలువను 30 శాతంపైగా పెంచారు. దీంతో బహిరంగ మార్కెట్లో భూముల విలువ మరింత పెరగనుంది. అవనిగడ్డ సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 32 గ్రామాల్లో 36 శాతం, బంటుమిల్లి సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 36 గ్రామాల్లో 55.5 శాతం, చల్లపల్లి సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 20 గ్రామాల్లో 32 శాతం, గుడివాడ సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 64 గ్రామాల్లో 30 శాతం, కానుమోలు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 29 గ్రామాల్లో 35, కౌతవరం సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 32 గ్రామాల్లో 33.33 శాతం, మొవ్వ సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 47 గ్రామాల్లో 32 శాతం, పెడన సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 36 గ్రామాల్లో 33 శాతం, మచిలీ పట్నం సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 33 గ్రామాల్లో 30.55 శాతం, గన్నవరం సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 55 గ్రామాల్లో 30 శాతం, కంకిపాడు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 31 గ్రామాల్లో 32 శాతం, ఉయ్యూరు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 39 గ్రామాల్లో 42 శాతం భూముల విలువను పెంచారు. పామర్రు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో ఇంకా భూముల రేట్ల పెంపుదలను ప్రకటించలేదు.
మార్కెట్లో భూముల విలువ పెరగడం వల్లే..
బహిరంగ మార్కెట్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల్లో రేట్లు గణనీయంగా పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏ గ్రామంలో భూముల విలువ ఎక్కువగా ఉందో ఆ గ్రామంలో మాత్రమే భూముల విలువ పెంచారు. దీనివల్ల భూములు రిజిస్ర్టేషన్ చేసుకునే సమయంలో తమ శాఖకు ఆదాయం పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి.
- ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్