ఐవోసీఎల్ టెర్మినల్.. భద్రం
ABN , First Publish Date - 2023-01-20T00:12:04+05:30 IST
ప్రమాదాన్ని రెప్పపాటులో పసిగట్టి.. అంతే వేగంతో రంగంలోకి దిగి.. రానున్న ఘోరాన్ని ఎదిరించటానికి సమాయత్తమయ్యారు. అగ్నిప్రమాద నివారణ చర్యలను నిమిషాల వ్యవధిలోనే చేసి చూపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) విజయవాడ (కొండపల్లి) టెర్మినల్లో భద్రతపై మాక్డ్రిల్ చేశారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఐఓసీఎల్ సంస్థ కొండపల్లిలోని విజయవాడ ఆయిల్ టెర్మినల్లో భద్రతా చర్యలను గురువారం మాక్ డ్రిల్ ద్వారా మీడియాకు ప్రత్యక్ష్యంగా వివరించారు. ప్లాంట్లో 58.6 ట్రిలియన్ కిలోలీటర్ల పెట్రోల్, 175 ట్రిలియన్ కిలోలీటర్ల డీజిల్ నిల్వచేసే ట్యాంకుల్లో లీకేజీ వల్ల భారీ అగ్ని ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంది. దాంతోపాటు అంతులేని నష్టం సంభవిస్తుంది. దీనిని నిరోధించాలంటే దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థలు అవసరం. ప్లాంట్ ఆవరణలో వారం రోజుల పాటు నిరంతరం నీళ్లు పంపింగ్ చేసేలా మొత్తం 12 వేల కిలోలీటర్ల నీటిని నిల్వ చేయటానికి నాలుగు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్లాంట్లో మొత్తం ఎనిమిది ఫైర్ పంప్స్ ఉన్నాయి. ఒక్కో పంపుద్వారా 410 కిలో లీటర్ల నీటిని సరఫరా చేస్తారు. ఆయిల్ స్టోరేజి భారీ ట్యాంకర్ల వద్ద నీరు, ఫోమ్ కురిపించే వ్యవస్థలు అమర్చబడి ఉంటాయి. ప్రమాదాలు జరిగితే ఎలా పనిచేస్తాయో విజయవాడ ఐఓసీఎల్ డీజీఎం అనిల్కుమార్ పర్యవేక్షణలో మీడియా సమక్షంలో కళ్లకు కట్టారు. ఇదంతా నిమషాల్లో జరిగిపోయింది. వెంటనే ప్లాంట్లో ఎర్ర జెండా ఎగురవేశారు. కొద్ది క్షణాల్లోనే లీక్ అయి ఫైర్ అవుతున్న ప్లాంట్ దగ్గర అగ్నినియంత్రణ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా ఫైర్ ఫైటర్స్, అంతలోనే క్షతగాత్రులను తరలించటానికి అంబులెన్స్లు రావటం, పరిస్థితులను అదుపులోకి తీసుకు రావటం నిమషాలలోనే జరిగిపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక.. ప్లాంట్లో పచ్చజెండా ఎగురవేశారు. డీజీఎం అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్లాంట్లో ప్రమాదం సంభవిస్తే కంట్రోల్ రూమ్కు సమాచారం ద్వారా అసెంబ్లింగ్ కావటం జరుగుతుందని, వెంటనే తీసుకోవాల్సిన చర్యలను సంబంధింత సిబ్బందికి వివరిస్తామని, నిమషాలలోనే అన్ని వ్యవస్థలు సమాంతరంగా పని చేస్తాయని చెప్పారు.