ఏపీఐఐసీకి బదలాయించిన భూమి పరిశీలన
ABN , First Publish Date - 2023-08-10T00:33:08+05:30 IST
భూములను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జగన్మోహనరావు, జేసీ సంపత్కుమార్ తదితరులు
నందిగామ రూరల్, ఆగస్టు 9 : పెద్దవరంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయించిన భూములను బుధవారం ఎమ్మెల్యే జగన్మోహనరావు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దవరంలో ఎనిమిది దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద రైతులు వ్యవసాయ భూములను సేద్యం చేసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 186 మంది రైతులకు చెందిన 116ఎకరాల భూమికి ఏపీఐఐసీకి బదలాయించిందన్నారు. రైతు లకు ప్రభుత్వం నుంచి ఆ భూమికి సంబంధించి ఎటువంటి పరిహారం అందలేదని రైతుల సమస్యను జాయింట్ కలెక్టర్కు తెలిపారు. సమగ్ర నివేదిక అందించాలని ఆర్డీవో రవీంద్రబాబును ఆదేశించారు. కార్యక్రమంలో మంగూనూరి కొండారెడ్డి, తహసీల్దార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.