సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:58 AM
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తల సంఘ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి అన్నారు. ఆదివారం ధర్నాచౌక్ వద్ద నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె శిబిరం ఆరో రోజుకు చేరింది.
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 17 : ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తల సంఘ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి అన్నారు. ఆదివారం ధర్నాచౌక్ వద్ద నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె శిబిరం ఆరో రోజుకు చేరింది. శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం ప్రాజెక్టు ప్రతినిధులు పి.రెజీనారాణి, సీహెచ్ నాంచారమ్మ, సీపీఎం నాయకులు బి.సుబ్రహ్మణ్యం, యూనస్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెకు కిశోర బాలికలు మద్దతు తెలిపారు.
లబ్ధిదారుల మద్దతు
ధర్నాచౌక్ : తమ సమస్యల పరిష్కారానికి స్థానిక ధర్నాచౌక్లో అంగన్వాడీలు చేపట్టిన ధర్నా ఆరోరోజు ఆదివారం కొనసాగింది. దీక్షకు లబ్ధిదారులు మద్దతుగా నిలిచి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేతలు మాట్లాడుతూ, ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాటం చేస్తున్నాయన్నారు. నాలుగేళ్లుగా సమస్యలపై పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోవడంతో తప్పని పరిస్ధితుల్లో సమ్మెక దిగాల్సి వచ్చిందన్నారు. చట్టాన్ని అమలు చేయాలని కాని వాటిని దిక్కరించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంవీ సుధాకర్, ఈవీ నారాయణ, ఎన్సీహెచ్ సుప్రజ, గజలక్ష్మీ, ఉమాదేవి, పి.అనిల్కుమార్, ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.