జగనన్న కాలనీలో ఆక్రమణ
ABN , First Publish Date - 2023-08-02T23:53:53+05:30 IST
నిన్నటి వరకు ప్లాట్ల ఆక్రమణ, దొంగ రిజిస్ట్రేషన్లతో ఇతరుల స్థలాల ఆక్రమణ, చెరువులు, రైల్వే స్థలాల ఆక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ అధికార పార్టీ అక్రమార్కులు జగనన్న కాలనీలపై పడ్డారు.
- సామాజిక అవసరాల స్థలంపైనా కన్ను
- 5 సెంట్లలో షెడ్డు ఏర్పాటు చేసి వైసీపీ రంగుల పూత
గుడివాడ : నిన్నటి వరకు ప్లాట్ల ఆక్రమణ, దొంగ రిజిస్ట్రేషన్లతో ఇతరుల స్థలాల ఆక్రమణ, చెరువులు, రైల్వే స్థలాల ఆక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ అధికార పార్టీ అక్రమార్కులు జగనన్న కాలనీలపై పడ్డారు. సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాల కబ్జాకాండకు తెరలేపారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో జగనన్న కాలనీ కోసం 100 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఒక్కొక్కరికి సెంటు చొప్పున 7,700 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. సామాజిక అవసరాల నిమిత్తం సుమారు 10 ఎకరాలను వేర్వేరు చోట్ల ఉంచారు. వీటిపై వైసీపీ నాయకుల కన్ను పడింది. అనుకున్నదే తడువుగా అక్రమణలకు తెరలేపారు. 1.21 ఎకరాల్లో ఉన్న సామాజిక అవసరాల భూమిలో వైసీపీ నాయకుడు తొలుత చిన్న రేకుల షెడ్డును ఏర్పాటు చేశాడు. క్రమేపీ దానిని విస్తరిస్తూ 5 సెంట్లలో షెడ్లు విస్తరించాడు. దీనికి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. చక్కగా వైసీపీ రంగులద్దాడు. దీనిని ఆసరాగా చేసుకుని మరో వైసీపీ నాయకుడు రేకులు, పరదాలతో మరో షెడ్డును ఏర్పాటు చేశాడు.
హౌసింగ్ అధికారులతో పరిశీలిస్తాం : ఆర్డీవో
జగనన్న కాలనీలోని సామాజిక అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలాలు కబ్జాకు గురవుతున్నట్టు ఆర్డీవో పి.పద్మావతి దృష్టికి తీసుకురాగా, గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలను పరిశీలిస్తామని ఆమె తెలిపారు.