విధుల్లోకి విద్యుత్ ఉద్యోగులు
ABN , First Publish Date - 2023-08-10T01:19:43+05:30 IST
విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. పవర్ ఎంప్లాయిస్ జేఏసీ గొడుగు కింద ఉన్న 26 సంఘాలు ప్రభుత్వంలోని పెద్దలతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని జేఏసీ నేతలు తెలిపారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)/ఎన్టీటీపీఎ్స(ఇబ్రహీంపట్నం): విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. పవర్ ఎంప్లాయిస్ జేఏసీ గొడుగు కింద ఉన్న 26 సంఘాలు ప్రభుత్వంలోని పెద్దలతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మెకు వెళ్లడం ఖాయమన్న కారణంగా విద్యుత్ ఉద్యోగులు సంస్థ ఇచ్చిన సీయూజీ సిమ్లను అధికారులకు అప్పగించేశారు. చర్చలు సఫలమైన సమాచారం రావడంతో వాటిని తీసుకోవడానికి రాత్రే కార్యాలయాలకు వెళ్లారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో క్షేత్రస్థాయి సిబ్బంది 1500 మంది వరకు ఉంటారు. వారంతా షిఫ్ట్ల వారీగా విధులను నిర్వర్తిస్తారు. రాత్రిపూట షిఫ్ట్ల్లో ఉండాల్సిన ఉద్యోగులు వర్క్ టు రూల్ కారణంగా సాయంత్రం ఐదు గంటలకే విధులు ముగించేసుకుంటున్నారు. సమ్మె ఆగిపోవడంతో ఇంటి వద్దే ఉన్న ఉద్యోగులు రాత్రిపూట విధులకు పయనమయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట విద్యుత్ కోతలు తీవ్రంగా ఉంటున్నాయి. సమస్యను సరిచేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది సమ్మెలోకి వెళ్తే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని ప్రజలు ఆందోళన చెందారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని తెలియడంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్టీటీపీఎస్ వద్ద ఉద్యోగుల ధర్నా
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, 2022 పీఆర్సీ అమలు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ ప్రధానమైన డిమాండ్లతో విద్యుత్ జేఏసీ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. విజయవాడ విద్యుత్ సౌధ ముట్టడిపై కొంత వెనక్కి తగ్గిన ఉద్యోగులు వర్క్టూరూల్ కార్యక్రమం విజయవంతం చేశారు. బుధవారం ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. సమ్మెలో భాగంగా బుధవారం ఇంజనీర్లు ప్రభుత్వ సెల్ఫోన్ సిమ్కార్డులను అధికారులకు అందజేశారు.