తండాలకు తాగునీరివ్వరేం!
ABN , First Publish Date - 2023-06-07T00:41:33+05:30 IST
కేంద్ర జలజీవన్ మిషన్ ద్వారా కిడ్ని వ్యాధి ప్రభావిత 15 గిరిజన తండాలకు నిరంతరం కృష్ణాజలాలు అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. మంగళవారం చైతన్యనగర్ తండాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, కిడ్నివ్యాధి ప్రభావం, పక్కా గృహాలు తదితర వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఎ.కొండూరు, జూన్ 6 : కేంద్ర జలజీవన్ మిషన్ ద్వారా కిడ్ని వ్యాధి ప్రభావిత 15 గిరిజన తండాలకు నిరంతరం కృష్ణాజలాలు అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. మంగళవారం చైతన్యనగర్ తండాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, కిడ్నివ్యాధి ప్రభావం, పక్కా గృహాలు తదితర వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు మూడురోజులకు ఒకసారి కృష్ణాజలాలు సరఫరా చేస్తున్నారని, తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులో నిజం ఉందని, అధికారులే అబద్దం చెబుతున్నారని తెలుస్తోందన్నారు. అనంతరం ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి కిడ్ని వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో కిడ్నీవ్యాధి సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషిచేస్తాయని, రోగులకు మెరుగైన సెవలు అందించేందుకు కృషిచేస్తామన్నారు. త్వరలో మండలానికి కృష్ణాజలాల సరఫరాపై పూర్తిగా అధ్యయనం చేయిస్తామన్నారు. డయాలసిస్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వ్యాధి నివారణకు అన్ని చర్యలు చేపడతామన్నారు. జిల్లా డీఎంఅండ్ హెచ్వో సుహాసిని, వైద్యాధికారులు బేబి, మాధవి, గిరిజ, స్వాతి, ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బబ్బురి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
నేరుగా తల్లుల ఖాతాల్లోకి కేంద్ర సాయం
జి.కొండూరు : ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం లబ్ధిదారులకు ఇకపై కేంద్రం నుంచి నేరుగా వారి ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి వివరించనున్నట్టు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. జి.కొండూరు పీహెచ్సీలో ఆమె లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలో పీఎంఎంవివై పథకం కింద 4,405 మంది లబ్ధిదారులకు రూ.72.80 కోట్లు అందించినట్టు చెప్పారు. ఈసాయం ఇకపై నేరుగా తల్లుల ఖాతాల్లో పడేలా కృషి చేస్తామన్నారు.