హలో డాక్టర్.. యాక్ట్ మిస్సాయే..!
ABN , First Publish Date - 2023-02-21T00:34:34+05:30 IST
ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను ఆయుష్ కమిషనర్ కార్యాలయం బేఖాతరు చేస్తోంది. ఇన్స్పెక్టర్ కమ్ డ్రగ్ లైసెన్సింగ్ ఆథారిటీ పోస్టుకు డాక్టర్ కె.మాధవరావు చౌదరిని నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కింది. ఆ పోస్టులో మూడేళ్ల నుంచి ఇన్చార్జిగా కొనసాగుతున్న వ్యక్తి తనే కొనసాగేందుకు జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో కొత్తవారి నియామకాన్ని అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జిగా కొనసాగుతున్న వ్యక్తి నియామకమే అసంబద్ధమనీ, పైగా కొత్తవారిని రానీయకుండా అడ్డుకోవడం మరో దారుణనీ ది మెడికల్ ప్రాక్టీసర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.
మంత్రి అండతో ఇన్స్పెక్టర్ కమ్ డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ ఇన్చార్జి చట్ట అతిక్రమణ
ప్రొఫెసర్గా కొనసాగుతూ మూడేళ్ల నుంచి ఇన్చార్జిగా ఉండటం ఆయుష్ నిబంధనలకు విరుద్ధం
కొత్తవ్యక్తిని నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించినా అమలు చేయని ఆయుష్ కమిషనర్
ఒత్తిళ్లే కారణమంటున్న మెడికల్ ప్రాక్టీసర్స్ అసోసియేషన్ ఆరోపణలు
ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను ఆయుష్ కమిషనర్ కార్యాలయం బేఖాతరు చేస్తోంది. ఇన్స్పెక్టర్ కమ్ డ్రగ్ లైసెన్సింగ్ ఆథారిటీ పోస్టుకు డాక్టర్ కె.మాధవరావు చౌదరిని నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కింది. ఆ పోస్టులో మూడేళ్ల నుంచి ఇన్చార్జిగా కొనసాగుతున్న వ్యక్తి తనే కొనసాగేందుకు జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో కొత్తవారి నియామకాన్ని అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జిగా కొనసాగుతున్న వ్యక్తి నియామకమే అసంబద్ధమనీ, పైగా కొత్తవారిని రానీయకుండా అడ్డుకోవడం మరో దారుణనీ ది మెడికల్ ప్రాక్టీసర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది.
(విజయవాడ ఆంధ్రజ్యోతి) : బనగానపల్లి ఆయుర్వేద స్పెషాల్టీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ కె.మాధవరావు చౌదరి విధులు నిర్వహిస్తున్నారు. ఈయన్ను ఇన్స్పెక్టర్ కమ్ డ్రగ్ లైసెన్సింగ్ ఆథారిటీగా నియమిస్తు ఫిబ్రవరి 3న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుష్ కార్యాలయం మాధవరావు చౌదరికి ఈ బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీకి ఇన్చార్జిగా ఉన్న పి.వి.ఎన్.ఆర్.ప్రసాద్ జిల్లాకు చెందిన మంత్రి అండతో ఆయుష్ అధికారులపై ఒత్తిడి తెచ్చి మాధవరావు నియామకాన్ని అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
డాక్టర్ ప్రసాద్ ద్విపాత్రాభినం
డాక్టర్ పి.వి.ఎన్.ఆర్ ప్రసాద్ డాక్టర్ నోరి రామ శాస్ర్తి గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాలలో రసశాస్త్ర ప్రొఫెసర్గా విధులు కొనసాగిస్తున్నారు. ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తిని డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీగా నియమించకూడదు. నిబంధనలు ధిక్కరించిన ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని ది మెడికల్ ప్రాక్టీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రాజేష్కుమార్ ఆరోపించారు. 1956 యాక్టు ప్రకారం ఆంధ్ర బోర్డు ఫర్ ఆయుర్వేద నియమావళిలో 24 మందితో కూడిన కమిటీ ఉండాలని స్పష్టంగా ఉంది. దీని ప్రకారం నాన్ టీచింగ్ వ్యక్తిని ఇన్స్పెక్టర్ కమ్ డ్రగ్ లైసెన్సింగ్ ఆథారిటీగా నియమించాలి. ఒకవేళ ఇన్చార్జిగా నియమించినా మూడు నెలల్లోపు కొత్తవారిని నియమించాలి. డాక్టర్ ప్రసాద్ను ఇన్చార్జిగా నియమించి మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా మంత్రి అండతో ఆ పదవిని వదలకుండా ఆయుష్ కమిషనర్పై ఒత్తిళ్లు తెస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.
డాక్టర్ ప్రసాద్పై ఆరోపణలు అనేకం
- డాక్టర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రొఫెసర్ బాధ్యతను పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు పాఠలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇతర వ్యాపకాల్లో మునిగిపోయారు. దీంతో సబ్జెక్టు పూర్తికాక విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
- కొత్త డ్రగ్ కంపెనీలకు లైసెన్సులివ్వాలన్నా, పాతవి రెన్యూవల్ చేయాలన్నా నానా కొర్రీలు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
- 2021లో ఆసుపత్రులకు మందుల సరఫరా టెండర్ నిబంధనలు రూపొందించడంలో ప్రసాద్ బాధ్యతారాహిత్యం వహించారని ఎన్ఎంఏ సభ్యులు ఆరోపించారు.
- కాలేజీ ప్రాంగణంలో ఉన్న మిని ఫార్మసీలో మందులు తయారు చేయాలి. మందుల్ని రోగులకు ఉచితంగా సరఫరా చేయాలి. కానీ బయట ఫార్మసీలో తయారు చేసిన ఉత్పత్తుల్ని మిని ఫార్మసీలో తయారు చేసినట్టు చూపి రూ.లక్షల్లో బిల్లులు దండుకున్నారని తెలిసింది.
- కరోన సమయంలో ఆయుష్- 64 మందులు తయారు చేసి పంపిణీ చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ నిర్ధేశిస్తే ఆ మందులను బయట మార్కెట్లో కొని సొంతంగా తయారుచేసినట్టు చూపారని ఆరోపణలున్నాయి. నచ్చిన ఫార్మసీకి తయారు కాంట్రాక్టు ఇచ్చారన్నా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.