సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు
ABN , First Publish Date - 2023-09-26T01:57:43+05:30 IST
స్పందన అర్జీదార్ల సమస్యల సత్వర పరిష్కారమే ‘స్పందన’ ముఖ్య ఉద్ధేశ్యమని, సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ దిల్లీరావు, ఇన్చార్జ్ డీఆర్వో జి.వెంకటేశ్వర్లు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు.

కలెక్టరేట్, సెప్టెంబరు 25 : స్పందన అర్జీదార్ల సమస్యల సత్వర పరిష్కారమే ‘స్పందన’ ముఖ్య ఉద్ధేశ్యమని, సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. దిల్లీరావు అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ దిల్లీరావు, ఇన్చార్జ్ డీఆర్వో జి.వెంకటేశ్వర్లు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పందనలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులను సమర్పిస్తారన్నారు. స్వీకరించిన ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ తప్పనిసరిగా అందజేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాస్, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం.విజయభారతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.రుక్మాంగదయ్య, హౌసింగ్ పీడీ రజినీ కుమారి, పశుసంవర్ధక శాఖ జేడీ కె.విద్యాసాగర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి బాలాజీ కుమార్, ఆర్అండ్బి ఎస్ఈ వీకే విజయశ్రీ, ఇరిగేషన్ ఎస్ఈ విష్ణుమోహన్రావు, ఎల్డీఎం కె.ప్రియాంక, డ్వామా పీడీ జె.సునీత, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె.అనురాధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పందన కార్యక్రమంలో 123 అర్జీలు నమోదు కాగా జిల్లాలోని డివిజన్ అధికారులు, ఆయా మండల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో పరిష్కారమయ్యే వినతులు వర్చువల్గా కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
స్పందనలో కలెక్టర్ రాజాబాబు
మచిలీపట్నం : స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా స్పందన సమావేశపుహాలులో సోమవారం అధికారులతో కలిసి ఆయన ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ప్రజల అర్జీలపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనచేసి, అర్జీదారులతో మాట్లాడి వారికి సంతృప్తికరమైన పరిష్కారం చూపాలన్నారు. విద్యార్థులకు బాల్యంనుంచి పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలపై అవగాహన కల్పించే యువ టూరిజం క్లబ్ను ఆయన ప్రారంభించారు. జిల్లాలో సామూహిక ఎలుకల నివారణపై అవగాహన కల్పిస్తూ వ్యవసాయశాఖ ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ను కలిసిన మల్లవల్లి రైతులు
హనుమాన్జంక్షన్రూరల్ : మల్లవల్లి పారిశ్రామికవాడకు భూములిచ్చి నష్టపరిహారం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నరైతులు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబుకు తమ సమస్యను ఏకరువుపెట్టారు. జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణతో కలిసి మల్లవల్లి భూనిర్వాసిత రైతులు మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎనిమిదేళ్లుగా ్టపరిహారం కోసం తిరుగుతున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని కలెక్టర్కు తెలిపారు. నెల రోజుల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, చిమట రవివర్మ, మహిళలు, రైతులు పాల్గొన్నారు.