పేదల ఇళ్లు కూల్చివేత!
ABN , First Publish Date - 2023-06-13T01:08:28+05:30 IST
మైలవరంలోని దళితవాడ (పెద్డగూడెం)లో 2017లో ప్రభుత్వం ఇచ్చిన పట్టా పొందిన నాలుగు పేద కుటుంబాలు నివా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. వారిలో నూతక్కి ప్రసాద్, కందుల సామ్యేలు, గురిజాల సుబ్బమ్మ, వంగూరి వసంతం ఆ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నీటి పన్ను కడుతున్నారు. కమ్యూనిటీ హాల్ పేరుతో ప్రభుత్వం ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని నాలుగు ఇళ్లు నేలమట్టం
దగ్గరుండి పడగొట్టించిన 100 మంది పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు
సీఎం, ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోసిన బాధితులు.. బాధితులకు మాజీమంత్రి ఉమా సంఘీభావం
మైలవరం, జూన్ 12: మైలవరంలోని దళితవాడ (పెద్డగూడెం)లో 2017లో ప్రభుత్వం ఇచ్చిన పట్టా పొందిన నాలుగు పేద కుటుంబాలు నివా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. వారిలో నూతక్కి ప్రసాద్, కందుల సామ్యేలు, గురిజాల సుబ్బమ్మ, వంగూరి వసంతం ఆ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నీటి పన్ను కడుతున్నారు. కమ్యూనిటీ హాల్ పేరుతో ప్రభుత్వం ఆ కుటుంబాలను రోడ్డున పడేసింది. సోమవారం ఉదయం 100 మంది ప్రత్యేక పోలీసులు, స్థానిక పోలీసులు, పంచాయతీ, రెవెన్యూ అధి కారులు అంతా కలిసి యంత్రాలతో వచ్చారు. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అడ్డువస్తున్నాయనే పేరుతో పేదలు నివాసం ఉంటున్న నాలుగు ఇళ్లను కూల్చ డం ప్రారంభించారు. ‘అయ్యా ఇందేంటి? ఇదేం పని. మా ఇళ్లు కూల్చితే మేం ఎక్కడికి పోవాలి. మా ఇళ్లు కూల్చవద్దు’ అని బాధితులు కాళ్ల వేళ్లా పడ్డారు. అయినా కనికరించని అధికారులు బలవంతంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధురాలు అని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ పోలీస్ బస్సులో వేసి మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు. అడ్డు తొలగిన తర్వాత నాలుగిళ్లను పూర్తిగా నేలమట్టం చేసేశారు.
పేదలకు అండగా ఉంటాం : ఉమా
అధికారులకు దమ్ముంటే మైలవరంలో వైసీపీ నాయకులు కబ్జా చేసిన ఖాళీ స్థలాలను ఖాళీ చేయించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సంఘీభావం తెలిపారు. పేదల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులు తుందన్నారు. నాలుగేళ్లు ఏం పీకలేని ఎమ్మెల్యే ఇప్పుడు నలుగురు పేదల ఇళ్లు కూల్చి కమ్యూనిటీ హాలు కడతాడా అని ఉమా మండిపడ్డారు. బాధితుల ఇళ్ల వద్ద నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావుతో ఉమా ఫోన్లో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నూతక్కి ప్రసాద్ అనే దివ్యాంగుడికి పంచాయతీలో పని కూడా తీసేశారని, ఇప్పుడు ఇళ్లు కూల్చారని ఉమా చెప్పారు. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్న ప్రసాద్కు పార్టీ తరఫున న్యాయం చేస్తామన్నారు. ఇలాగే మిగిలిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పార్టీ బాధితులకు అండగా ఉంటుందన్నారు.
మీకు.. మా ఉసురు తగులుతుంది
నేరం చేసిన వారిలా పోలీస్స్టేషన్ తరలిస్తుంటే కడపు మండిన బాధితులు సీఎం జగన్మోహన్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్పై దుమ్మెత్తిపోశారు. ‘మాలాంటి వారి ఉసురు మీకు తగల మానదు. మట్టి కొట్టుకుపోతారు. మా పిల్లలు, భార్య ఉసురు మీకు తగలక మానదు. దౌర్జన్యంగా పోలీసులతో ఖాళీ చేయిస్తారా. మేం ఏం నేరం చేశామని పోలీసుస్టేషన్కు తరలిస్తున్నారు’ అని బోరున విలపించారు. కూల్చిన శిథిలాలను చూసి విలవిలలాడారు. ఇళ్లు కూల్చిన తర్వాత పోలీసులు బాధితులను వదిలేశారు. తమ ఇళ్ల వద్దకు వచ్చి కూల్చిన శిథిలాలను చూసిన నాలుగు కుటుంబాల బాధితులు గుండెలు బాదుకుంటూ రోదించారు.
మమ్మల్ని చంపేసి శిథిలాల్లో వేయండి
కూలీ నాలీ చేసుకుని జీవించే మాకు చిన్న పిల్లలున్నారు. వారిలో ఒక గర్భిణి ఉంది. గూడు కూల్చి నడిరోడ్డు మీద వదిలేశారు. మేం ఎలా బతకాలి? ఎక్కడికెళ్లాలి?. ఇప్పటి ప్పటికి ఇల్లు కట్టుకోవాలన్నా లక్షలతో కూడుకున్న పని. కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపకుండా అన్యాయం చేశారు. మాకు న్యాయం చేయకపోతే చనిపోతాం. లేదా మీరే పెట్రోల్ పోసి చంపేసి మా ఇంటి శిథిలాల్లోనే సమాధి చేయండి. - ఇళ్లు కోల్పోయిన బాధితులు