‘లెక్క’లేనితనం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:56 AM
ఆర్థిక ఉల్లంఘనలు.. దుబారా ఖర్చులు.. నిర్వహణ లోపాలు.. అస్తవ్యస్త రికార్డులు.. ఇదీ కొండపల్లి పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాక మూటగట్టుకున్న అవినీతి. దాస్తే దాగిపోతుందా.. ఈ మునిసిపాలిటీ ఆర్థిక అక్రమాలు, అరాచకాలను 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ శాఖ బహిర్గతం చేసింది. ఆడిట్కు దొరక్కుండా ఉండటానికి రిజిస్టర్లు, ఫైళ్లను ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టింది. క్యాష్బుక్స్, అడ్వాన్స్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు, సెక్యూరిటీ డిపాజిట్ల రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించలేదని అక్షింతలు వేసింది. వస్తున్న ఆదాయాలు, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవటం, వాటి రికార్డులను సక్రమంగా చూపకపోవడంపై ఆగ్రహించింది. లావాదేవీలన్నీ చట్టబద్ధంగా లేకపోవడాన్ని ప్రశ్నించింది.
నిధుల దుర్వినియోగంపై కడిగేసిన ఆడిట్ శాఖ
రూ.10 కోట్లకు పైబడి వెలుగుచూసిన అక్రమాలు
జనరల్ ఫండ్స్, 14వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం
నగదు పుస్తకాల్లో జమ చేసినవి కొన్నే.. జమ చేయనివి ఎన్నో..
ఆడిట్ శాఖకు అందని రికార్డులు.. అధికారులకు అక్షింతలు
ఎమ్మెల్యే వసంత బంధువులే ఇన్చార్జులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ఇబ్రహీంపట్నం) : కొండపల్లి మునిసిపాలిటీలో జనరల్ ఫండ్స్, 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి దాదాపు రూ.6 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగి ఉండవచ్చని ఆడిట్ శాఖ పేర్కొంది. జనరల్ ఫండ్స్ నిధుల్లో ఇతరాల కింద ఖర్చు చేసిన రూ.35.79 లక్షల్లో రూ.21 లక్షలు నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. అడ ్జస్ట్మెంట్ బిల్లులు, ఆఫీసు జనరల్ బిల్లుల రూ.2.28 కోట్ల లావాదేవీలకు సంబంధించి పేమెంట్ వోచర్లు, రిజిస్టర్లను ఆడిట్ శాఖకు మునిసిపాలిటీ అందజేయలేదు. వీటిపైనా అనేక అభ్యంతరాలను పేర్కొంది. జనరల్ ఫండ్స్లో సచివాలయ వ్యయం కింద చూపిన రూ.4.36 లక్షలకు సంబంధించి ఎలాంటి ఫైల్స్ను అందించలేదు. ఇవన్నీ ఆర్థిక అవకతవకలకు ఆస్కారం ఉన్నవిగా అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాటిని సోదాహరణంగా వివరిస్తూ రికార్డులు, రిజిస్టర్లు సమర్పించని కారణంగా వాటికి సంబంధించిన నష్టాన్ని అధికారులు, ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని తెలిపింది. వారే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొంది. ఎలక్ర్టికల్ గూడ్స్కు సంబంధించి రూ.16.61 లక్షలు, జీతాలకు రూ.5.98 లక్షలు, పీడబ్ల్యూఎస్ మెటీరియల్కు సంబంధించి రూ.6.10 లక్షలు, పబ్లిక్ హెల్త్కు సంబంధించి రూ.1.83 లక్షల రిజిస్టర్లను ఆడిట్కు అందజేయకపోవటాన్ని ఆడిట్ తీవ్రంగా తప్పుబట్టింది. శానిటేషన్ మెటీరియల్, వాహనాల డీజిల్ ఖర్చులు, శానిటేషన్ సప్లయర్ల చెల్లింపులకు సంబంధించి రూ.20.83 లక్షలు పేమెంట్లు చేసింది. వీటికి సంబంధించిన ఫైళ్లను కోరినా మునిసిపాలిటీ నుంచి స్పందన లేదు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించిన ఓచర్లు, ఎంబుక్ రిజిస్టర్లు, కనెక్టెడ్ ఫైళ్లు.. ఒక్కదానిని కూడా ఆడిట్కు స్వాధీనం చేయాలని కోరినా చేయలేదు. సీఎఫ్ఎంఎస్ డేటా ప్రకారం ఆడిట్ అధికారులు ఆడిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఆడిట్ అధికారులు రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. డ్రెయిన్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పైపులైన్ల పనులకు సంబంధించి రూ.1.04 కోట్లకు రికార్డులు సరిగ్గా లేవని గుర్తించింది. ఆయిల్ బిల్లులకు సంబంధించి ఖర్చు పెట్టిన రూ.15.96 లక్షలకు కూడా రికార్డులపై అనుమానాలు వ్యక్తం చేసింది. శానిటేషన్కు రూ.5.54 లక్షలు, వాహనాల మరమ్మతులకు రూ.12.07 లక్షలు, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పబ్లిక్ హెల్త్ గూడ్స్కు రూ.30.76 లక్షలు, పీడబ్ల్యూఎస్ మెటీరియల్కు రూ.59.59 లక్షలు, ఇతర ఖర్చులు రూ.18.96 లక్షలు, ఎలక్ర్టికల్ మెటీరియల్ రూ.7.30 లక్షలు వంటి వాటికి ఏ రికార్డులు కూడా సవ్యంగా లేవని గుర్తించింది.
పన్నుల విధానం అస్తవ్యస్తం
ఈఆర్పీ విధానంలో పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, మునిసిపాలిటీ ఈఆర్పీగా తన ఖాతాలను మార్చుకోకపోవటం వల్ల తీవ్రమైన దుర్వినియోగానికి అవకాశాలున్నాయని ఆడిట్ అభిప్రాయపడింది. మునిసిపాలిటీ నుంచి వీటికి సంబంధించి ఎలాంటి రికార్డులు రాకపోవటంతో సీఎఫ్ఎంఎస్ ద్వారా పరిశీలన జరపగా, కొత్తగా నిర్మించిన భవనాలకు ఆస్తిపన్నును ఫిక్సేషన్ చేశారని తెలిసింది. సీఎఫ్ఎంఎస్లో గుర్తించిన వాటికి సంబంధించి బిల్డింగ్ ఫైల్స్ కోరగా, ఆ వివరాలను మునిసిపాలిటీ ఆడిట్కు సమర్పించకపోవటంతో భారీ దుర్వినియోగం జరిగి ఉండవ చ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే, మునిసిపాలిటీ స్థిర, చరాస్తులకు సంబంధిం చిన రికార్డులు కూడా సక్రమంగా లేవని గుర్తించింది. పంచాయతీ నుంచి మునిసిపా లిటీగా ఏర్పడి చాలా రోజులు గడిచినా పన్నులు, ఇతర రుసుములకు సంబంధించి మునిసిపాలిటీ బైలాస్ ఇప్పటికీ ఖరారు కాకపోవటం ఆందోళనకు దారితీస్తోంది.
అధికార పార్టీ నేతలు చెప్పినట్టే..
కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి చూస్తే అధికారులు, ఉద్యోగుల లెక్కలేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టు తలూపటం, నిబంధనలను అడ్డగోలుగా తుంగలో తొక్కటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చేసిన దొంగతనాలు బయట పడతాయన్న ఉద్దేశంతో రికార్డులను కూడా సక్రమంగా నిర్వహించలేదు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన బంధువులను మునిసిపాలిటీలో ఇన్చార్జులుగా నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరికే పరిపాలనా బాధ్యతలు అప్పగించటంతో కొండపల్లి మునిసిపాలిటీలో అడ్డగోలు వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. ఇన్చార్జుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తే దొంగతనాలు బయటకు వస్తాయని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి.