పోలవరంపై మాట్లాడటమే మానేసిన సీఎం: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2023-04-03T01:08:39+05:30 IST
సీఎం జగన్ పోలవరం గురించి మాట్లాడటమే మానేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు ధ్వజమెత్తారు.
జి.కొండూరు, ఏప్రిల్ 2: సీఎం జగన్ పోలవరం గురించి మాట్లాడటమే మానేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరారవు ధ్వజమెత్తారు. ఆదివారం గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ఎన్నిసార్లు ప్రధాన మం త్రిని, ఆర్థిక మంత్రిని, జలవనరుల మంత్రిని కలిశారో, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారో బహిర్గతం చేయాలన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయి కేంద్రం నుంచి తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు నాబార్డు కింద ఖర్చు పెట్టిన డబ్బులు రూ.13,500 కోట్లు వచ్చాయని ఆ డబ్బులు ఇవాళ ఏమయ్యాయని ప్రశ్నించారు. దేనికి ఖర్చు చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక రూ.6 వేల కోట్లు వస్తే నిర్వాసితులకు కట్టావా? డాన్ సైట్లో కట్టావా? లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చావా అని ప్రశ్నించారు. 31 మంది ఎంపీలుండి పోలవరానికి ఖర్చు పెట్టిన డబ్బులు రూ.2,600 కోట్లు తెచ్చుకోలేని అసమర్థ దద్దమ్మ నిస్సహాయ స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం గోదావరిలో నట్టేట ముంచిందన్నారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్ప లేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.