అర్హులైన రైతులందరికీ సీసీఆర్సీ కార్డులివ్వాలి
ABN , First Publish Date - 2023-06-22T00:41:36+05:30 IST
ఖరీఫ్ సీజన్లో అర్హత ఉన్న ప్రతీ ఒక్క రైతుకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్సీ) కార్డులను అందజేయాలని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కమిషనర్లు, ఎంపీడీవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్, జూన్ 21 : ఖరీఫ్ సీజన్లో అర్హత ఉన్న ప్రతీ ఒక్క రైతుకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్సీ) కార్డులను అందజేయాలని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కమిషనర్లు, ఎంపీడీవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు (సీసీఆర్సీ), జగనన్న సురక్ష, జగనన్న లే అవుట్లో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, నాడు నేడు, జగనన్న తోడు తదితర అంశాలపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను పంట ప్రారంభ దశలోనే అందజేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కౌలు రైతుల వివరాలను సకాలంలో బ్యాంకులకు అందించడం ద్వారా బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈనెల 23న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి కార్యక్రమం గురించి వివరించాలన్నారు. క్యాంపులపై కమిషనర్లు, ఎంపీడీవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. పేదల గృహ నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యా కానుక కిట్ల పంపిణీ నూరు శాతం పంపిణీ జరిగేందుకు ఎంఈవోలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ పి.సంపత్ కుమార్, డీఆర్వో కె.మోహన్కుమార్, డీఆర్డీఏ కె.శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రజిని కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.నాగమణమ్మ, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, డీసీవో సీహెచ్ శైలజ, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె.అనురాధ, జిల్లా మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహసీల్ధార్లు పాల్గొన్నారు.