పక్కా ప్రణాళికతోనే పథకాల ఎగవేత

ABN , First Publish Date - 2023-03-26T00:48:14+05:30 IST

ఐదేళ్లు ఇవ్వాల్సిన ప్రతి పథకాన్ని ప్రణాళిక ప్రకారం మూడు, నాలుగు సంవత్సరాలకు కుదిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

పక్కా ప్రణాళికతోనే పథకాల ఎగవేత

అజిత్‌సింగ్‌నగర్‌, మార్చి 25 : ఐదేళ్లు ఇవ్వాల్సిన ప్రతి పథకాన్ని ప్రణాళిక ప్రకారం మూడు, నాలుగు సంవత్సరాలకు కుదిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మొగల్రాజపురంలోని ఆయన నివాసంలో శనివారం ఉమా మాట్లాడుతూ, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలను గుప్పించిన జగన్‌ నేడు పథకాలను మూడు, నాలుగేళ్లకు కుదించి ప్రజలను మోసగిస్తున్నాడని అన్నారు. ఆరు నెలల క్రితం ఇవ్వాల్సిన మూడో విడత ఆసరా పథకాన్ని ఇప్పుడు ఇస్తే.. నాలుగు, ఐదు విడతలు ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. జనవరిలో ఇచ్చే అమ్మఒడి పథకాన్ని జూన్‌, జూలైకి మార్చి మరో ఆరు నెలలు వెనక్కి నెట్టారన్నారు. ఈలోగా ఎన్నికలు వస్తే ఐదోవిడత ఎగవేయాలనే జగన్‌ ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ముఖ్యమంతి ఇచ్చిన హామీ మేరకు ఫించన్లను పెంచలేదని అన్నారు. విద్యుత్‌ బిల్లులు గుట్టుచప్పుడు కాకుండా పెంచుకుంటూ పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసి ప్రజలపై ఆర్ధిక భారాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. చెత్తపన్నును వ్యతిరేకిస్తూ ఆదివారం ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని, ఈలోగా ప్రజలు ఎవరూ చెత్తపన్ను కట్టవద్దని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-26T00:48:14+05:30 IST