Vijayawada: కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...

ABN , First Publish Date - 2023-04-08T12:10:17+05:30 IST

విజయవాడ: కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. చేతికి గాయం అయ్యిందని ఆస్పత్రిలో చేరితే.. ఏకంగా చేతినే కోల్పోవాల్సి వచ్చింది.

Vijayawada: కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...

విజయవాడ: కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. చేతికి గాయం అయ్యిందని ఆస్పత్రిలో చేరితే.. ఏకంగా చేతినే కోల్పోవాల్సి వచ్చింది. చేతికి కట్టు వేసిన డాక్టర్ కట్టులో సర్జికల్ బ్లెడ్ మర్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. చేతికి పురుగు కుట్టిందని విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా.. డాక్టర్ ఇన్ఫెక్షన్ తొలగించి చేతికి కట్టు వేశారు. అయితే కట్టులో సర్జికల్ బ్లెడ్ మర్చిపోయారు.

తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి (22) తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు కుట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత నూజివీడు డాక్టర్లు పరిశీలించి ఇన్ఫెక్షన్ సోకిందని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్టు (డ్రెస్సింగ్) కడుతూ అందులో సర్జరీ కోసం ఉపయోగించే బ్లేడు మరిచిపోయి కట్టు వేశారు. దీంతో చేయికి పూర్తిగా ఇన్ఫెక్షన్ పాకింది. దీంతో డాక్టర్లు చేయి తీసేయాలని అనటంతో ఆమె పరిస్థితి అయోమయంగా మారిపోయింది.

చిన్న గాయంతో ఆసుపత్రికి వస్తే పూర్తిగా తన చేతినే తొలగిస్తామని చెప్పడంతో తులసి, ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్త ఇద్దరు కూలీ పనులు చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో వారు బాధ వర్ణనాతీతంగా మారింది.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందించి చేయి తీయకుండా ఉండేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-08T12:10:17+05:30 IST