గంజాయి నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2023-06-11T01:19:21+05:30 IST
గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 21కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇబ్రహీంపట్నం స్టేషన్ పరిధిలో మార్చి 4వ తేదీ 2023న కొండపల్లి శాంతినగర్లో కుందేటి నాగరాజు ఇంటిలో 13మంది కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడిచేసి 12మందిని అరెస్టు చేసి వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 10 : గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 21కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఇబ్రహీంపట్నం స్టేషన్ పరిధిలో మార్చి 4వ తేదీ 2023న కొండపల్లి శాంతినగర్లో కుందేటి నాగరాజు ఇంటిలో 13మంది కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడిచేసి 12మందిని అరెస్టు చేసి వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు షేక్ నాగూర్ బాషా(29) గంజాయి విక్రయిస్తుండగా శనివారం అరెస్టు చేశారు.
విస్సన్నపేట-రెడ్డిగూడెం రోడ్డులో..
విస్సన్నపేట : విస్సన్నపేట-రెడ్డిగూడెం రోడ్డులో నిర్జన ప్రదేశంలో శనివారం గంజాయి విక్రయిస్తున్న ముగురిని అరెస్టు చేసినట్టు ఏసీపీ ఎం.రమేశ్ చెప్పారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, విస్సన్నపేటకు చెందిన పొలిమెట్ట సుభాశ్, పరసం వేణుసాయి, మరో మైనర్ కలిసి రెడ్డిగూడెం మండలం ముచ్చెనపల్లికి చెందిన గంటా జీవన్ వద్ద 100 గ్రాముల గంజాయి రూ.500లకు కొనుగోలు చేశారు. గంజాయిని వారు సేవించి, మిగిలిన దాన్ని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై జీవీవీ సత్యనారాయణ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వారి నుంచి గంజాయి, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జీవన్ పరారీలో ఉన్నాడని, అతడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సీఐ ఆర్.భీమరాజు పాల్గొన్నారు. ఎస్సైతో పాటు ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రాం ప్రసాద్, షేక్ మీరా, షేక్ కాసిం, శేఖర్, రవి, పాపారావులను అభినందించి రివార్డులు అందించారు.