అంగన్వాడీలపై మొండివైఖరి వీడాలి
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:22 AM
అంగన్వాడీల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి మారాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు సోమవారం సంఘీభావం తెలిపారు.
గన్నవరం, డిసెంబరు 25 : అంగన్వాడీల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి మారాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు సోమవారం సంఘీభావం తెలిపారు. జగన్ మనసు మారాలని అంగన్వాడీల కార్యకర్తలు, ఆయాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అంగన్వాడీలను ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, రమా, సాంబ తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకునే శక్తిని సీఎం జగన్కు ఇవ్వు..
ఉంగుటూరు : ఓ ప్రభువా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తిని సీఎం జగన్కు ఇవ్వు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఏసుక్రీస్తును వేడుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత రెండు వారాలుగా చేస్తున్న నిరవధిక దీక్షలపట్ల ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలు సోమవారం తేలప్రోలులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్ధానిక సచివాలయం నుంచి ఐటీఐ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. స్ధానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, సీఐటీయూ నేతలు ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కడవకొల్లు రామరాజు మాట్లాడుతూ, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను బలవంతంగా పగలగొట్టి సచివాలయ సిబ్బందికి నిర్వహణ బాధ్యతలు అప్పగించినా, పిల్లల్ని పంపించేందుకు తల్లులు విముఖత చూపటంతో మండలంలో పలు కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, రమ్యకృష్ణ, తాటిపాముల నాగయ్య, గులిపల్లి సందీప్, శివాజీ, నాగబాబు, మోహన్రెడ్డి, మహేష్, నాగూర్, సుధాకర్, రాంబాబు, అనిల్, అప్పారావు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
గుణదల : అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రామవరప్పాడు అంగన్వాడీ కేంద్రం వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని తల్లిదండ్రుల సమక్షంలో సోమవారం రాత్రి నిర్వహించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు ర్యాలీలో పాల్గొన్న తల్లులు కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది పనిని సచివాలయ సిబ్బంది వలంటీర్లతో చేయించేసుకుందామని చూడటం భావ్యం కాదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే సిబ్బంది చేసే ఆందోళనలకు తామూ మద్దతుగా నిలబడతామని పిల్లల తల్లులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామవరప్పాడు అంగన్వాడీ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.