టీడీపీ ఫ్లెక్సీల తొలగింపు
ABN , First Publish Date - 2023-07-15T01:00:44+05:30 IST
విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో రెండు రోజుల క్రితం టీడీపీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను పంచాయతీ అధికారులు తొలగించడంపై శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నున్నలో రెండు రోజుల క్రితం కట్టిన ఫ్లెక్సీలు తొలగించిన పంచాయతీ అధికారులు
రెండు నెలల నుంచి గ్రామంలో వైసీపీ ఫ్లెక్సీలు.. వాటి జోలికెళ్లని సిబ్బంది
విజయవాడ రూరల్, జూలై 14: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో రెండు రోజుల క్రితం టీడీపీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను పంచాయతీ అధికారులు తొలగించడంపై శుక్రవారం ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ బస్సుయాత్రతో పాటుగా నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా గ్రామంలోని నూజి వీడు రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి పంచాయతీ అధికారులు బ్యానర్ల తొలగింపు చేపట్టారు. వైసీపీ బ్యానర్లు ఉన్నా, కేవలం టీడీపీ బ్యానర్లు మాత్రమే తొలగించడంపై వారు ఆందోళనకు దిగారు.
పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యంరాజుతో పాటు గంపా శ్రీనివాస యాదవ్, శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు పంచాయతీ అధికారులను సంప్రదిం చేందుకు ప్రయత్నించారు. ఈవోతో సహా సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అందు బాటులో లేకపోవడంతో నేరుగా ఈవో ఇంటికి వెళ్లారు. బ్యానర్ల తొలగింపుపై ప్రశ్నిం చారు. బ్యానర్ల తొలగించడం తనకు తెలియదని ఈవో చెప్పారు. దీంతో టీడీపీ నేతలు నున్న రూరల్ సీఐకి ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా గ్రామంలో ఉన్న వైసీపీ బ్యానర్లను తొలగించకుండా టీడీపీ రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యానర్ల తొలగింపు ఈవో తెలియదని చెబతున్నారని, ప్రైవేట్ వ్యక్తులు తొలగిస్తే చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.