కొత్త ప్రభుత్వాస్పత్రి సీ బ్లాక్‌లో పనిచేయని ఎక్స్‌రే యంత్రం

ABN , First Publish Date - 2023-06-01T01:20:59+05:30 IST

కొత్త ప్రభుత్వాస్పత్రి సీ బ్లాకులో ఐదు నెలల నుంచి ఎక్స్‌రే యంత్రం పనిచేయక రోగులు ఇబ్బంది పడుతున్నారు.

కొత్త ప్రభుత్వాస్పత్రి సీ బ్లాక్‌లో పనిచేయని ఎక్స్‌రే యంత్రం
మూసి ఉంచిన ఎక్స్‌రే రూమ్‌

ఐదునెలలుగా రోగుల అవస్థలు..పట్టించుకోని అధికారులు

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): కొత్త ప్రభుత్వాస్పత్రి సీ బ్లాకులో ఐదు నెలల నుంచి ఎక్స్‌రే యంత్రం పనిచేయక రోగులు ఇబ్బంది పడుతున్నారు. క్యాజువాల్టీ నుంచి ఎక్స్‌రే తీయించుకోవాలంటే సూపర్‌ స్పెషాల్టీ బ్లాకుకు వెళ్లాల్సి వస్తోంది. ఎక్స్‌రే తీయించుకునేవారిని ఆ బ్లాకుకు తీసుకెళ్లేందుకు సిబ్బందీ ఉండరు. బంధువులే భుజం పైనో, స్ట్రెచర్‌ పైనో సూపర్‌ స్పెషాల్టీ బ్లాకుకు చేరవేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణ తరువాత వారికి అక్కడ ఎక్స్‌రే తీసి, ఆ ఫిల్మ్‌ను సంబంధిత డాక్టర్‌కు వాట్సాప్‌లో పంపుతున్నారు. అక్కడి నుంచి డాక్టర్‌ దగ్గరకెళ్లే లోపు ఓపీ సమయం ముగిసిందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో మరో రోజు రావాల్సి వస్తోంది. సీ బ్లాకులోని మరో యంత్రంపై రోడ్డు ప్రమాదాల కేసుల వారికే ఎక్స్‌రే తీస్తున్నారు. సాధారణ ఎక్స్‌రేలకు వెనుక బ్లాకుకు వెళ్లాలని సూచిస్తున్నారు. సరైన స్ట్రెచర్లు లేక తీసుకెళ్లే వారు లేక ఎక్స్‌రే తీయించుకోవాల్సిన వారు నానాయాతన పడుతున్నారు. త్వరగా ఎక్స్‌రే యంత్రం బాగుచేయించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-06-01T01:21:35+05:30 IST