Kotam Reddy Sridhar Reddy: కోటంరెడ్డి జలదీక్ష భగ్నం

ABN , First Publish Date - 2023-04-06T20:08:53+05:30 IST

నెల్లూరు (Nellore) రూరల్‌లోని పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) గురువారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు.

Kotam Reddy Sridhar Reddy: కోటంరెడ్డి జలదీక్ష భగ్నం

నెల్లూరు: నెల్లూరు (Nellore) రూరల్‌లోని పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) గురువారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హౌస్‌ అరెస్ట్‌ (House arrest) చేసిన పోలీసు అధికారులు... 11 గంటలపాటు నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాస పరిసరాల్లో ఆంక్షలు విధించారు. పొట్టేపాళెం వెళ్లనివ్వకుండా అడ్డుకుని, భారీగా బలగాలను మోహరించారు. దీంతో ఇంటి ముందే నిరసన దీక్ష చేపట్టిన కోటంరెడ్డి ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడమే తాను చేసిన తప్పా అంటూ సీఎం జగన్‌ సర్కారు తీరును ఎండగట్టారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొట్టేపాళెం కలుజుపై జలదీక్ష నిర్వహించేందుకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం సిద్ధమయ్యారు. అయితే, తెల్లవారుజాము 5 గంటలకే ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు 6 గంటల ప్రాంతంలో ప్రధాన ద్వారం మూతేశారు. జలదీక్షకు అనుమతి లేదని, పొట్టేపాళెం వెళ్లేందుకు వీల్లేదంటూ నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తానొక్కడినే దీక్ష చేస్తున్నానని, ఇంకెవరూ రారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయినా ససేమీరా అంటూ బయటకు రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

11 గంటలపాటు పోలీసు పహారా

పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే తన ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు పోలీసులు ఆయన ఇంటి పరిసరాల్లో కఠితర ఆంక్షలు అమలు చేశారు. ప్రజా ఆందోళనలపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలనుకుంటే అది వారి అమాయకత్వమేనని జగన్‌పై శ్రీధర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ నెల 13న ప్రభుత్వం నిర్వహించబోతున్న ‘జగనన్నకు చెప్పుకుందాం రండి..’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరురూరల్లో ప్రజలు చెప్పింది విందాం రండి నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. త్వరలో అమరావతిలోనూ గాంధీగిరి పద్ధతిలో నిరసన చేయబోతున్నట్లు వెల్లడించారు.

మేయర్‌ను అడ్డుకున్న పోలీసులు

మేయర్‌ ఎవరు...? అంటూ పోలీసులు మేయర్‌ పోట్లూరి స్రవంతి వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాగ జొన్నవాడ నుంచి నెల్లూరు వైపు వచ్చేవారిని పొట్టేపాళెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తరువాతే నెల్లూరులోకి అనుమతించారు. కాగా, ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు తెలియడంతో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు మాగుంట లేఅవుట్‌లోని ఆయన నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-04-06T20:08:53+05:30 IST