యువగళం..ప్రభంజనం

ABN , First Publish Date - 2023-03-05T23:38:16+05:30 IST

పీలేరులో ఆదివారం జరిగిన నారా లోకేశ యువగళం పాదయాత్రకు స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.

యువగళం..ప్రభంజనం
పీలేరులో జరిగిన లోకేశ పాదయాత్రలో భారీగా పాల్గొన్న ప్రజలు

నారా లోకేశ పాదయాత్రకు అపూర్వ ఆదరణ ఫ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

పీలేరు, మార్చి 5: పీలేరులో ఆదివారం జరిగిన నారా లోకేశ యువగళం పాదయాత్రకు స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. రాష్ట్ర ప్రజానీకం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న తమ యువనేతకు జనం నీరాజనం పలికారు. గతంలో ఏ నాయకుడికీ లభించని విధంగా లోకేశకు ఆదివారం పీలేరు వాసులు ఘనస్వాగతం పలికారు. ఆకాశం నుంచి పూలవర్షం కురుస్తోందా అన్నట్లు టీడీపీ శ్రేణులు లోకేశపై పూల వర్షం కురిపించారు. పీలేరు-చిత్తూరు మార్గంలో జరిగిన బహిరంగసభ అనంతరం పాదయాత్ర సాగిన మార్గంలో తమ అభిమాన నేతను చూడడానికి, అతడి అడుగులో అడుగు వేయడానికి జనం పోటెత్తడంతో పాదయాత్రలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

పీలేరు మండలంతో పాటు నియోజకవర్గంలోని కలికిరి, కలకడ, గుర్రంకొండ, వాల్మీకిపురం, కేవీపల్లె మండలాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చిన సామాన్య ప్రజానీకం, టీడీపీ శ్రేణులతో పీలేరు పట్టణం కిక్కిరిసిపోయింది. పీలేరు-చిత్తూరు మార్గంలోని భాస్కర ఐటీఐ వద్ద నుంచి మదనపల్లె మార్గంలోని డిగ్రీ కళాశాల వరకు లోకేశ పాదయాత్ర సాగిన మార్గమంతా జనంతో నిండిపోయింది. నేల తల్లి ఈనిందా, ఆకాశం పగిలిందా అన్నట్లు జనం తరలిరావడంతో జనాన్ని కంట్రోల్‌ చేయడం అటు పాదయాత్ర వలంటీర్లు, ఇటు పోలీసులకు ఇబ్బందిగా మారింది. లోకేశను చూసేందుకు పాదయాత్ర సాగిన మార్గంలో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు, యువకులు బారులు తీరారు.

బాణాసంచా పేలుళ్లు, చెక్కభజనలు, కోలాటాలు, కేరళ డ్రమ్స్‌, బళ్లారి డ్రమ్స్‌ శబ్దాలతో పాదయాత్ర మార్గం హోరెత్తిపోయింది. పాదయాత్ర సాగిన చిత్తూరు రోడ్డు, నాలుగు రోడ్ల కూడలి, ఎల్‌బీఎస్‌ రోడ్డు, కొండారెడ్డి క్రాసు ప్రాంతాలతో పాటు రాత్రి బస ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతం వరకు జనసంద్రాన్ని తలపించాయి. పాదయాత్రకు అంచనాలకు మించి జనం రావడంతో పీలేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పీలేరు చరిత్రలో లోకేశ పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఆదివారం నాటి కార్యక్రమం నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

పోలీసు వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు

లోకేశ పాదయాత్ర సమయంలో చిత్తూరు మార్గంలోని అరుణ్‌ డైరీ పార్లర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు టపాకాయలు పేల్చేందుకు ప్రయత్నించగా పీలేరు అర్బన సీఐ మోహన రెడ్డి వారిని అడ్డగించారు. టపాసులు కాల్చేందుకు ప్రయత్నించిన కార్యకర్తను సీఐ చొక్కా పట్టుకుని జీపులోకి తోశారు. దీనిని గమనించిన ఇతర కార్యకర్తలు జీపును చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సీఐ వెనక్కు తగ్గి కార్యకర్తను వదిలేశారు. దీంతో అక్కడున్న కార్యకర్తలందరూ రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:38:16+05:30 IST