పల్లెల వైపు వన్యప్రాణుల పరుగులు
ABN , First Publish Date - 2023-08-02T23:44:02+05:30 IST
వన్యప్రాణులకు అటవీ ప్రాంతంపై విసుగుచెందినట్లుంది. ఇటీవల వన్యప్రాణులన్నీ అటవీ ఆవాసాలు విడిచి పల్లెలపై పడుతున్నాయి. ప్రకృతి సమతుల్యానికి వన్యప్రాణులు మనకు ఎంతో అవసరం. అటువంటి వన్యప్రాణులు జనజీవనానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే వాతావరణంలో కలుగుతున్న మార్పులు, అడవుల్లో నీటి వసతి లభించకపోవడం, అడవుల చుట్టూ ఉన్న చిట్టడవులను భారీ ఎత్తున తెగనరికి వాటిని చట్టవ్యతిరేకంగా వ్యవసాయయోగ్యంగా మార్చుకుని అటవీ చుట్టుపక్కల ప్రాంతాల్లోసంచారం లేకుండా చేయడం ఇత్యాధికరణాలతో జంతువులు గ్రామాలపై పడుతున్నాయి.
కోడూరు వద్ద ఏనుగు మృతి - సిద్దవటంలో ఎలుగుబంటి హల్చల్
నందలూరులో ఇండ్లల్లోకి వచ్చిన పొడదుప్పి
చిట్వేలి సూపర్ మార్కెట్లోకి దూరిన కొండగొర్రె, హాస్టల్లో దూరిన పొడదుప్పి
చెరువులో పడిపోయిన మరో పొడదుప్పి
అటవీ పరీవాహక ప్రాంతాల్లోకి చేరుతున్న అడవి పందులు, వన్యమృగాలు
బెంబేలెత్తుతున్న ప్రజలు
రాజంపేట, ఆగస్టు2: వన్యప్రాణులకు అటవీ ప్రాంతంపై విసుగుచెందినట్లుంది. ఇటీవల వన్యప్రాణులన్నీ అటవీ ఆవాసాలు విడిచి పల్లెలపై పడుతున్నాయి. ప్రకృతి సమతుల్యానికి వన్యప్రాణులు మనకు ఎంతో అవసరం. అటువంటి వన్యప్రాణులు జనజీవనానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే వాతావరణంలో కలుగుతున్న మార్పులు, అడవుల్లో నీటి వసతి లభించకపోవడం, అడవుల చుట్టూ ఉన్న చిట్టడవులను భారీ ఎత్తున తెగనరికి వాటిని చట్టవ్యతిరేకంగా వ్యవసాయయోగ్యంగా మార్చుకుని అటవీ చుట్టుపక్కల ప్రాంతాల్లోసంచారం లేకుండా చేయడం ఇత్యాధికరణాలతో జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ఇటీవల వరుసగా కేవలం ఆరు నెలల్లోనే రాజంపేట, కోడూరు ప్రాంతాల అటవీ పరివాహక ప్రాంతాల్లో అడవి జంతువులు ఊర్లపై పడుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లె ప్రాంతానికి ఏనుగు వచ్చింది. అయితే అక్కడ విద్యుదాఘాతానికి గురై పెద్ద ఏనుగు చనిపోయింది. ఇదే రోజు మండల కేంద్రమైన సిద్దవటం సచివాలయ సమీపంలో జనావాసాల నడుమ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ప్రజల నివాసాల మధ్యలోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రజలు వేసిన అరుపులు, కేకలతో ఎలుగుబంటి ఏకంగా ఓ చింతచెట్టు ఎక్కేసింది.
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది చెట్టు నుంచి కిందకి దిగలేదు. దీనికి భయపడిన ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ ఎత్తున పోలీసులు, అటవీ అధికారులు మొహరించి అది ప్రజలపై దాడి చేయకుండా చర్యలు చేపట్టారు. ఇక చేసేది లేక స్థానిక అటవీ అధికారులు తిరుపతి జూపార్క్ సిబ్బందికి సమాచారం అందించారు. వారం రోజుల కిందట నందలూరులో ఏకంగా ఇంటిలోకే పొడదుప్పి వచ్చింది. అంతకముందు నెలరోజుల కిందట ఇదే నందలూరు మండలానికి ఆనుకుని కన్యక చెరువులోకి పొడదుప్పి రావడంతో కుక్కలు తరమడంతో పొడదుప్పి చెరువు నీటిలో పడిపోయింది. వెనువెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించి దానిని తీసుకెళ్లారు.
మూడు నెలల కిందట చిట్వేలిలో విద్యార్థులు నివాసమున్న ప్రభుత్వ హాస్టల్లోకి అడవి దుప్పి ప్రవేశించింది, ఆరు నెలల కిందట ఏకంగా సూపర్మార్కెట్లోకి కొండగొర్రె ప్రవేశించి అక్కడివారిని సంబ్రమాశ్చరాల్లో ముంచెత్తింది. ఒంటిమిట్ట అటవీ పరివాహక ప్రాంతాలైన నరవకాటిపల్లె, చింతరాజుపల్లె, మారాడుపల్లె, కొండరాజుపల్లె, కోనాపురం తదితర ప్రాంతాల్లో రోజూ జింకలు, దుప్పులు, అడవి పందులు, పొడదుప్పులు, కణితులు సంచరిస్తూనే ఉన్నాయి. రాజంపేట పట్టణం చుట్టూ అడవి పందులు సంచరించని ప్రాంతం లేదు. చుట్టూ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడం, ఆ వెంచర్లలో ఇళ్లు కట్టుకోకపోవడం, ఏళ్ల కొద్దీ ఖాళీగా ఆ భూముల్లో భారీ ఎత్తున కంపచెట్లు మొలవడం, అందులో అడవి పందులు చేరిపోతున్నాయి. రాజంపేటకు బైపాస్ రోడ్డు ఆనుకుని పాతబస్టాండు నుంచి చిట్వేలి రోడ్డులోని పోలి వరకు ఇటు తాళ్లపాక, మన్నూ రు చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది ఎకరాలు భూమి వ్యవసాయానికి నోచుకోక ఖాళీగా ఉంది.
ఈ భూమిలో భారీగా కంపచెట్లు చేరి వందల కొద్దీ అడవి పందులు చేరాయి. రాత్రి వేళ బైపాస్ రోడ్డులో వెళ్లాలంటే అడవి పందుల బాధతప్పడం లేదు. ఇటీవల అనేక ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా అమాంతం అడ్డుపడడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారు. రాజంపేట-కోడూరు ప్రాంతంలో సస్యశ్యామలమైన అటవీ ప్రాంతముంది. ఇటు కడప-నెల్లూరు, రైల్వేకోడూరు-తిరుపతి, చిట్వేలి-నెల్లూరు, సిద్దవటం-బద్వేలి, రాజంపేట-రాయచోటి, ఒంటిమిట్ట చుట్టుపక్కల ఏ ప్రాంతంలో చూసినా అటవీ ప్రాంతాలే. ఈ అటవీ ప్రాంతాల్లోని చుట్టుపక్కల చిట్టడవులు ఎన్నో ఉన్నా అడవులను ఆనుకుని ఉన్న చిట్టడవులన్నీ మటుమాయమయ్యాయి. ఏకంగా ఎక్స్కవేటర్లు రావడం, ఆ కొండలను చదును చేయడం, దానిని వ్యవసాయయోగ్యంగా మార్చుకోవడం, చుట్టూ ముళ్లకంచెలు వేయడం వల్ల అడవి జంతువుల సంచారానికి తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఇక కోడూరు ప్రాంతంలో కోడూరు, శేషాచలం అడవుల మధ్య అటూ ఇటూ ఎప్పుడూ ఏనుగులు, చిరుతలు, జింకలు, ఇతర అటవీ జంతువులన్నీ వందలాదిగా సంచరిస్తూ ఉంటా యి. సుమారు 20 కిలోమీటర్ల మేర దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతం ఉండటం వల్ల నిత్యం ఏనుగులు, ఇతర జంతువులు పండ్ల తోటలపై దాడులు చేయడం, ఏకంగా పల్లెలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం బుడుగుంటపల్లె సమీపంలో ఏనుగు వచ్చి విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. ఇక ఓబులవారిపల్లె, పుల్లంపేట మండలాల్లో పూర్తిగా దట్టమైన శేషాచల అటవీ ప్రాంతం. నిత్యం ఇక్కడ అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి.
అటవీ పరివాహక గ్రామాలన్నీ వీటి బారిన పడుతున్నాయి. అటవీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా, పొలాల్లోకి చొరబడకుండా పెద్దపెద్ద కంచెలు ఏర్పా టు చేశారు. అయినా ఈ అడవి జంతువులు అటవీ ప్రాంతాల్లో ఏమి జరుగుతుందో ఏమో కానీ అవి పల్లెలపై పడి జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. వీటి పరిరక్షణపై అటవీ శాఖాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.