నిధులున్నా అభివృద్ధి ఎందుకు చేయడంలేదు..?
ABN , First Publish Date - 2023-03-25T22:39:22+05:30 IST
నగరపంచాయతీలో నిధులున్నా అభివృద్ధి మాత్రం సున్నాగా తయరైందని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు.
కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల మండిపాటు
ఎర్రగుంట్ల, మార్చి 25: నగరపంచాయతీలో నిధులున్నా అభివృద్ధి మాత్రం సున్నాగా తయరైందని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు. ఎర్రగుంట్ల నగరపంచాయతీ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం చైౖర్మన్ ఎం.హర్షవర్దన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కో-ఆప్షన్ సభ్యు డు డి.సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రూ.3 కోట్లు మిగులున్నట్లుగా చూపిస్తున్నారని ఇన్ని నిధులు ఉన్నా అభివృద్ధి ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రపోజల్స్ ఏడీబీకి పంపుతామని అక్కడ సూచించిన పనులు మాత్రమే చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. కొందరు కాంట్రాక్టర్లు పనిదక్కించుకుని చేయడంలేదని వారిని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. కడప రోడ్డులో డ్రైన్ లేక వర్షపు నీరంతా రోడ్లపైనే నిలుస్తోందని 6వ వార్డు కౌన్సిలర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పందులు, కుక్కలనుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని గత సమావేశంలోనే కోరామని అయినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమని కౌన్సిలర్ ఆలీ పేర్కొన్నారు. పదిరోజులుగా తమ వీధిలోకి చెత్త ఆటోలు రావడంలేదని కౌన్సిలర్ భాస్కర్ పేర్కొన్నారు. రెండేళ్లుగా విద్యుత్స్తంభాలు అడుగుతున్నా పట్టించుకోవడంలేదని కౌన్సిలర్ వెంకటలక్షుమ్మ ప్రశ్నించారు. తమ వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. ఈకార్యక్రమంలో వైస్ఛైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.