బీసీ జనగణనను వెంటనే చేపట్టాలి
ABN , First Publish Date - 2023-06-02T23:12:55+05:30 IST
బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్యయాదవ్, జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కడప (మారుతీనగర్), జూన్ 2: బీసీ జనగణనను వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్యయాదవ్, జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాత రిమ్స్ వద్ద గల బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ కులాల జనాభా గణన చేయకుంటే రాబోవు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ప్రధాని మోదీ ఉన్నత వర్గాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను ఆగమేఘాలపై పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేశారన్నారు. బీసీల జనగణనను కేంద్రం వెంటనే చేపట్టాలన్నారు. బీసీ జనగణన చేపట్టకపోతే ‘బీజేపీకి ఓటు - బీసీలకు చేటు’ అనే నినాదంతో పోరాడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు కొన్ని డిమాండ్లును చేపట్టారు. జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మండల కమిషన్ సిఫార్సులను తక్షణం అమలు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. బీసీలకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయరును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ జనగణన కమిటీ కార్యచరణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తల లింగమూర్తి, బంగారు నాగయ్య, సుంకేసుల ఖాదర్బాషా, గువ్వల మధుసూదన్రావు, సాన శ్రీనివాసులు, క్రిష్ణమూర్తి, మునిరత్నం, నరిసంహ, నరసింహులు, కళ్యా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.