ట్రిపుల్ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-09-20T00:01:46+05:30 IST
పేద కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం దక్కింది. తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. ఇంజనీరై ప్రయోజకుడిగా మారి కుటుంబబాన్ని ఆదుకుంటాడని ఎంతో ఆనందంతో ఉన్నారు.

వేంపల్లె, సెప్టెంబరు 19: పేద కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం దక్కింది. తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. ఇంజనీరై ప్రయోజకుడిగా మారి కుటుంబబాన్ని ఆదుకుంటాడని ఎంతో ఆనందంతో ఉన్నారు. ఏమైందో ఏమోకాని బలవన్మరణానికి పాల్పడి కన్నవారి ఆశలను అడియాశలు చేశాడు. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న నీర్జాంపల్లె గంగారాం (20) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఈ విషాద ఘటన మంగళవారం జరిగింది. విద్యార్థులు, ట్రిపుల్ఐటీ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
లింగాల మండలం తేర్నాంపల్లెకు చెందిన దంపతులు నీర్జాంపల్లె గంగాధర్, నారాయణమ్మ కూలిపనులతో జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగారాంకు 10వ తరగతిలో మంచిమార్కులు రావడంతో ట్రిపుల్ఐటీలో సీటుదక్కింది. సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో గంగారాం ఉరివేసుకున్నాడు. పక్కగది విద్యార్థులు గమనించి సెక్యూరిటీ సిబ్బందికి, ట్రిపుల్ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందాడు. మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇన్చార్జి సీఐ గోవిందరెడ్ఢి ఘటన స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించి విచారించారు. వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ట్రిపుల్ఐటీలో చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడని, వారి మధ్య ఏదో సమస్య వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. విద్యార్థి సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.