అన్ని మున్సిపాలిటీల్లో ప్రీఆడిట్ విధానాన్ని అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-06-11T23:39:37+05:30 IST
జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రీ ఆడిట్ విధానాన్ని అమలు చేయాలని స్టేట్ ఆడిట్ డైరెక్టరు హరిప్రకాశ్ అన్నారు.
స్టేట్ ఆడిట్ డైరెక్టరు హరిప్రకాశ్
కడప (ఎర్రముక్కపల్లె), జూన్ 11: జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రీ ఆడిట్ విధానాన్ని అమలు చేయాలని స్టేట్ ఆడిట్ డైరెక్టరు హరిప్రకాశ్ అన్నారు. ఆదివారం కడప కార్పొరేషన్ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జీఓ నెం.74 ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో ప్రీ ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు. తొలుత దేవదాయశాఖలో ప్రీ ఆడిట్ విజయవంతంగా నిర్వహించామన్నారు. దీనిపై మున్సిపల్ శాఖ డైరెక్టరుకు వివరించడంతో ఆయన తమ శాఖకు సంబంధించి ప్రీ ఆడిట్ నిర్వహించాలని సూచించారని తెలిపారు. మున్సిపల్ శాఖలో ప్రీ ఆడిట్ ప్రాముఖ్యత గుర్తించి ఉన్నతాధికారులు జీఓ నెం.74 జారీ చేసి అందుకనుగుణంగా తగిన చర్యలు చేపట్టారన్నారు. ఈ వ్యవహారంతో మున్సిపల్ నిధులు కూడా పదిలంగా ఉంటాయన్న భావన ప్రజల్లోకి వెళ్లి స్థానిక సంస్థలకు వారి తోడ్పాటు మరింత పెరుగుతుందన్నారు. పురపాలిక సంఘం బలోపేతం కావడంతో విశ్వసనీయత అందరికీ తెలిసి వస్తుందని.. మున్సిపాలిటికి అందాల్సిన నిధులు కూడా సకాలంలో అందుతాయని తెలిపారు. అనంతరం హరిప్రకాశ్ మున్సిపల్ కమిషనర్లతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కడప జిల్లా ఆడిట్ అధికారి మంజుల, కార్పొరేషన్ ఎగ్జామినర్ లక్ష్మి నాయుడు, అకౌంటెంట్ రాధిక, జిల్లాలోని పలువురు మున్సిపల్ కమిషనర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.