క్రీడలతో మానసికోల్లాసం
ABN , First Publish Date - 2023-03-30T23:15:27+05:30 IST
క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక దృఢత్వం పెరుగుతుందని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జట్ల మధ్య గురువారం రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది.
ఆసక్తిగా సాగిన కలెక్టర్, ఎస్పీ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్
బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్న కలెక్టర్, ఎస్పీలు
విజేతగా నిలిచిన ఎస్పీ జట్టు
రాయచోటి (కలెక్టరేట్), మార్చి 30: క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక దృఢత్వం పెరుగుతుందని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జట్ల మధ్య గురువారం రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జట్టుకు కలెక్టర్ కెప్టెన్గా వ్యవహరించగా ఎస్పీ జట్టుకు ఎస్పీ కెప్టెన్గా వ్యవహరించారు. టాస్ గెలిచిన ఎస్పీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎస్పీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఇందులో ఎస్పీ బ్యాటింగ్ చేసి 11 రన్లు కొట్టి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. 223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కలెక్టర్ జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే సాధించింది. 111 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కలెక్టర్ జట్టుపై గెలుపొందిన ఎస్పీ టీంను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో రంగస్వామి, కలెక్టరేట్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.