Indigo Airlines: జగన్ ప్రభుత్వానికి ఇండిగో షాక్.. బకాయిలు కట్టకపోతే విమానాలు ఆపేస్తాం
ABN , First Publish Date - 2023-08-22T23:20:08+05:30 IST
వయబులిటీ గ్యాప్ నిధులు ఇవ్వకపోతే కడప విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిపివేస్తామని ఇండిగో విమాన సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి విమాన టికెట్లు కూడా నిలిపివేశారు.
రూ.20 కోట్ల బిల్లుల పెండింగ్తో ఇండిగో వార్నింగ్
కడప, ఆంధ్రజ్యోతి: వయబులిటీ గ్యాప్ నిధులు ఇవ్వకపోతే కడప విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిపివేస్తామని ఇండిగో విమాన సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచి విమాన టికెట్లు కూడా నిలిపివేశారు. దీనిపై అధికారయంత్రాంగం ఫిర్యాదు చేయడంతో సెప్టెంబరు 15 వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచింది.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఉడాన్ పథకం ద్వారా అప్పట్లో ట్రూజెట్ విమాన సేవలను కడప విమానాశ్రయం నుంచి ప్రారంభించింది. అయితే ట్రూజెట్ విమానాల కొరత, ఉడాన్ పథకం గడువు ముగియడంతో విమానాలు నిలిచిపోయాయి. అనంతరం కరోనాతో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోయాయి. అనంతరం కడప నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. కడప నుంచి ప్రతిరోజు హైదరాబాద్ తిరుగుతుండగా బెంగళూరు, చెన్నై, వైజాగ్లకు వారంలో నాలుగు సార్లు, మూడు సార్లు చొప్పున విమానాలు తిప్పుతోంది. కడప విమానాశ్రయం నుంచి తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో ఇండిగో నష్టపోతోంది. ఈ నష్టాన్ని భరించేందుకు ఇండిగో సంస్థకు రూ.20కోట్లు వయోబులిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నిధులు ఇవ్వకపోడంతో సెప్టెంబరు 1వ తేదీ నుంచి తమ సర్వీసులు నిలిపివేస్తామని ఇండిగో వెల్లడించింది. చివరకు కలెక్టర్, ఇతర అధికారుల చొరవతో సెప్టెంబరు 15 వరకు గడువు ఇచ్చారు.
జిల్లా వాసులు ఇప్పుడు విమాన ప్రయాణాలకు బాగా అలవాటు పడ్డారు. నిత్యం హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, వైజాగ్ ఫ్లైట్లకు ఆదరణ బాగానే ఉంది. మిగతా పట్టణాలకు వారంతో పాటు డైలీ విమానాలు ఉంటాయని ఆశించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఇండిగో సర్వీసులు నిలిచిపోతాయేమోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.