ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించండి
ABN , First Publish Date - 2023-02-06T22:56:48+05:30 IST
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు.
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), ఫిబ్రవరి 6: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ జయరాజు, డ్వామా పీడీ మద్దిలేటి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందన కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపి బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదికలు పంపాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపు క్లియర్ అయ్యేటట్లు చూడాలన్నారు.