దివ్యాంగులకు సమగ్రశిక్ష వరం

ABN , First Publish Date - 2023-05-31T23:43:45+05:30 IST

దివ్యాంగులకు సమగ్ర శిక్ష వరం లాంటిదని సమగ్రశిక్ష జిల్లా పథక సంచాలకులు అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

దివ్యాంగులకు సమగ్రశిక్ష వరం
దివ్యాంగ విద్యార్థులకు కిట్లు అందిస్తున్న ప్రభాకర్‌రెడ్డి

కడప (ఎడ్యుకేషన్‌), మే31: దివ్యాంగులకు సమగ్ర శిక్ష వరం లాంటిదని సమగ్రశిక్ష జిల్లా పథక సంచాలకులు అంబవరం ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం 243 మంది దివ్యాంగ విద్యార్థులకు రూ.36లక్షల విలువ గల బోధనోపకరణాల కిట్లను పంపిణీ చేశారు. కడప నగరం సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయ ఆవరణంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంటు డైరెక్టర్‌ క్రిష్ణకిశోర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని ప్రతిభావవంతులు హాజరయ్యారు. వయసు వారీగా వారికి అవసరమైన బోధన ఉపకరాణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమగ్రశిక్ష ద్వారా విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకళ్లు, వీల్‌ఛైర్లు, రోలేటర్లు, చంకకర్రలు, కంటి సహాయక ఉపకరణాలతో పాటు పిల్లలు నైపుణ్యాల పెంపుదలకు అవసరమైన బోధనోపకరణాలను పంపిణీ చేశామన్నారు. ఒక్కో కిట్‌ విలువ రూ.12వేల నుంచి రూ.16వేల వరకు ఉంటుందని, వాటిని తల్లిదండ్రుల వారి పిల్లలకు దైనందిన చర్యలతో పాటు విద్యావికాసానికి వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. సమగ్రశిక్ష అందిం చే పరికరాలను సక్రమంగా వినియోగించి దివ్యాంగులను సాధారణ విద్యార్థులకు దీటుగా తయారు చేయాలని భవిత ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు మిట్ట కేశవరెడ్డి, రమణమూర్తి, దశరథరామిరెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, విజయమ్మ, సిద్దారెడ్డి, మమత, ప్రవీణ్‌ పాల్గొన్నారు

Updated Date - 2023-05-31T23:43:45+05:30 IST