వైసీపీ ఎమ్మెల్యేలు అంతరాత్మను అనుసరించాలి!

ABN , First Publish Date - 2023-03-15T03:49:32+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అంతరాత్మను అనుసరించాలి!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీఎల్పీలో చంద్రబాబు

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. వైసీపీ తరఫున పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులనూ గెలిపించుకోవాలని.. దీనికి మంత్రులందరూ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మంత్రివర్గ సమావేశంలో చెప్పారని ప్రసార సాధనాల్లో వచ్చిన వార్తలపై చర్చ జరిగింది. ‘అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పండి’ అని చంద్రబాబు సూచించారు.

ముఖ్యమంత్రి భయపడుతున్నారు: పయ్యావుల

టీడీఎల్పీ సమావేశం తర్వాత పీఏసీ చైౖర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడారు.. ‘ఏడు ఎమ్మెల్సీ సీట్లూ గెలవకపోతే మంత్రి పదవులు మార్చేస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు అంతరాత్మ ప్రబోధానుసారం ఓట్లు వేస్తారని ఆయన భయపడుతున్నట్లు అనుమానం వస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. రాజధానిపై జగన్‌రెడ్డి చీకట్లో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘మంత్రివర్గ సమావేశంలో జూలైలో విశాఖకు వెళ్తామని చెప్పారని వార్తలు వచ్చాయి. అదే విషయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదు? కోర్టులో ఉన్న అంశం గురించి పెడితే చదవడానికి గవర్నర్‌ నిరాకరించారా? విశాఖే రాజధాని అయితే అసెంబ్లీలోనే ప్రకటించవచ్చు కదా? ఏ అసెంబ్లీలో మాట తప్పారో అక్కడే చెబితే మాట తప్పుతున్నారో మడమ తిప్పుతున్నారో తేలిపోతుంది’ అని అన్నారు.

Updated Date - 2023-03-15T03:49:32+05:30 IST