హిందూ ధర్మంపై విస్తృత ప్రచారం
ABN , First Publish Date - 2023-08-02T03:44:52+05:30 IST
సనాతన హిందూ ధర్మంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
స్కూళ్లు, కాలేజీలకు వెళతాం
6 నుంచి నెల రోజులపాటు కార్యక్రమం
త్వరలోనే ధర్మ ప్రచార పరిషత్: మంత్రి కొట్టు
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సనాతన హిందూ ధర్మంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 6న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం నుంచి ప్రారంభించి, నెల రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత అన్నవరం దేవస్థానం చుట్టుపక్కల గ్రామాలు, ఆ ప్రాంతంలోని విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ ధర్మంపై ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ ప్రచారంలో భాగంగా హిందూ ధర్మంపై ప్రవచనాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఇంజనీరింగ్ కళాశాలల స్థాయి వరకు కూడా సనాత ధర్మం ఆచరణపై విస్తృత ప్రచారం చేస్తామన్నారు. పాఠశాలల్లో మత ప్రచారం ఏవిధంగా చేస్తారని ఒక విలేకరి ప్రశ్నించగా.. హిందూ ధర్మంపై పిల్లలు చదువుకోవడానికి ఏ సిలబస్ ఇవ్వడంలేదని, కోర్సు ఇవ్వడంలేదు, దీని మీద ఒక అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర మతాలకు చెందినవారు కూడా ఉండే విద్యా సంస్థల్లో మత ప్రచారం చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించగా... నా శాఖకు సంబంధించిన అంశాలనే నేను చెబుతున్నానని మంత్రి అన్నారు. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే త్వరలోనే ధర్మప్రచార పరిషత్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, తిరుపతి హథీరాంజీ మఠానికి గతంలో మహంతుగా ఉన్న అర్జునదాస్ అనే వ్యక్తి పలు అక్రమాలకు పాల్పడినట్లు త్రిసభ్య కమిటీ పలు ఆధారాలతో ధృవీకరించిందని ఆ మహంతుపై తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఽధార్మిక పరిషత్ నిర్ణయించినట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో చేపట్టిన 1917 దేవాలయాల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.