సాంకేతిక విద్యాశాఖకు ఏమైంది?

ABN , First Publish Date - 2023-06-01T05:44:05+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తుతో సాంకేతిక విద్యాశాఖ ఆటలాడుతోంది. ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది.

సాంకేతిక విద్యాశాఖకు ఏమైంది?

అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలపై తీవ్ర నిర్లక్ష్యం

అకారణంగా పాలీసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

అస్పష్టమైన నిర్ణయాలతో విద్యార్థులకు నష్టం

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తుతో సాంకేతిక విద్యాశాఖ ఆటలాడుతోంది. ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఈసెట్‌ 45 రోజుల పాటు వాయిదా పడింది. దీంతో పాలిటెక్నిక్‌ నుంచి ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో చేరే విద్యార్థులు నెల రోజులకు పైగా తరగతులను కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా పాలీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను కూడా అకారణంగా వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం గురువారం నుంచి విద్యార్థులు కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. కానీ ఎలాంటి కారణం లేకుండానే ఆ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లు ఎప్పటినుంచి పెట్టుకోవచ్చనేది కూడా ఇప్పుడే చెప్పలేమని, దీనిపై తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరినా వారు సమాధానం ఇవ్వలేదు. కాగా రిజిస్ట్రేషన్‌, రుసుముల చెల్లింపుల గడువును జూన్‌ 5 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక విద్యాశాఖ తీరుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిచేసిన వారు ఈసెట్‌ రాసి, ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో చేరతారు. ఈ ఏడాది ఈసెట్‌ మే 5న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు షెడ్యూలు కూడా విడుదల చేశారు. అంతా అయిపోయాక తీరికగా పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ విద్యార్థుల పరీక్షలు పూర్తికాలేదని సాంకేతిక విద్యాశాఖ అధికారులు చెప్పడంతో, ఇచ్చిన షెడ్యూలు మొత్తం రద్దుచేశారు. గతేడాది ఇంజనీరింగ్‌ ప్రవేశాలపై కూడా పదేపదే షెడ్యూలు వాయిదా వేయడంతో చాలామంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా సాంకేతిక విద్యాశాఖ అదే ధోరణి అవలంబిస్తోంది.

Updated Date - 2023-06-01T05:44:05+05:30 IST